కిరణ్తో మాట్లాడ్తా: టిపై డిగ్గీ, రాజ్యసభ బరిలో గంటావర్గం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాను తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మాట్లాడుతానని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో అన్నారు. తనను కలిసేందుకు కిరణ్ శుక్రవారం ఢిల్లీకి వస్తున్నారని చెప్పారు. ఆయనతో తెలంగాణ బిల్లు విషయమై మాట్లాడుతానని చెప్పారు.
గడువుపై తర్జన భర్జన
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన గడువు పెంచే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. రెండు వారాల గడువుకు రాష్ట్రపతి మొగ్గు చూపుతుండగా, షిండే మాత్రం వారం గడువు కోరుతున్నట్లుగా సమాచారం.
కాంగ్లో రాజ్యసభ ట్విస్ట్
కాంగ్రెసు పార్టీలో రాజ్యసభ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఆరు ఖాళీల్లో ముగ్గురు కాంగ్రెసు నుండి, ఇద్దరు టిడిపి నుండి ఎంపికయ్యే అవకాశముంది. ఆరో వ్యక్తి కోసం ఓటింగ్ జరగనుందా అనే చర్చ సాగుతుండగానే... తెలంగాణ బిల్లు నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు అధికార పార్టీని ధిక్కరిస్తూ తమ తమ సభ్యులను రాజ్యసభ బరిలో దింపేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే జెసి దివాకర్ రెడ్డి తన కోసం సంతకాలు చేయించుకున్నారు.
మరోవైపు మంత్రి గంటా శ్రీనివాస రావు శాసన మండలి సభ్యులు చైతన్య రాజును రాజ్యసభ బరిలోకి దింపుతున్నారు. ఆయనకు మద్దతుగా గంటా సంతకాలు చేయిస్తున్నారు. దీంతో కాంగ్రెసు పార్టీకి కనీసం ఆ మూడు సీట్లు దక్కే అంశంపై గందరగోళం ఏర్పడనుంది.
గడువు పెంచాలని దేవినేని
తెలంగాణ బిల్లుపై చర్చకు అదనపు గడువు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ బిల్లుపై రాష్ట్రపతి ఇంతవరకు అదనపు గడువు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. అదనపు గడువు ఇవ్వకుంటే రా.12 గంటల వరకు సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సభలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని దేవినేని స్పష్టం చేశారు.