ఆఫ్గన్ నుంచి భారతీయుల తరలింపు... కాబూల్లో ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఐఏఎఫ్ విమానం...
ఆఫ్గనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 180 మందిని ఆఫ్గన్ నుంచి భారత్ చేర్చగా... మిగతావారిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తాజాగా భారత్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కాబూల్ చేరుకుంది. అయితే విమానం ల్యాండ్ అవడానికి ఇంకా క్లియరెన్స్ రాలేదని తెలుస్తోంది. విమానం ల్యాండ్ అవగానే కాబూల్ విమానాశ్రయంలో వేచి వున్న భారతీయులను స్వదేశానికి తరలించనున్నారు.
ఆది,మంగళవారాల్లో ఆఫ్గన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించిన సంగతి తెలిసిందే. మొదట ఎయిర్ ఇండియా విమానం,ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో భారతీయులను స్వదేశానికి తరలించారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్నే ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ను ఆక్రమించుకోవడంతో వందలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. రోడ్లపై అడుగడుగునా తుపాకులతో తాలిబన్లు సంచరిస్తున్నారు. దీంతో కాబూల్ విమానాశ్రయానికి చేరుకోవడం కష్ట సాధ్యంగా మారింది.
మంగళవారం(ఆగస్టు 17) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో దాదాపు 120 మంది భారతీయులను స్వదేశానికి తరలించగా ఇందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. తాలిబన్లకు సమాచారం లీక్ అవకుండా,వారికి చిక్కకుండా,ఒకవేళ చిక్కినా దాడుల నుంచి తప్పించుకునేలా ముందే కచ్చితమైన వ్యూహాలు రచించారు. రెండంచెల ప్రక్రియ ద్వారా భారత్ ఈ ఆపరేషన్ను పూర్తి చేసింది. ఇందులో మొదటిది 'ఎయిర్పోర్టుకు చేరే మిషన్',రెండవది 'ఎయిర్పోర్ట్ నుంచి భారత్కు'.

మొదటి మిషన్ ప్రకారం... ఆగస్టు 16 రాత్రికి ఆఫ్గనిస్తాన్లోని భారతీయులంతా కాబూల్ విమానాశ్రయానికి చేరుకోవాలని,రాత్రంతా అక్కడే ఉండాలని భారత అధికారులు వారికి సమాచారమిచ్చారు. దీంతో అందరూ విమానాశ్రయానికి బయలుదేరారు. కానీ ఇంతలోనే తాలిబన్లు అకస్మాత్తుగా రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించారు.దీంతో భారత అధికారులు అప్పటికప్పుడు ప్లాన్ మార్చేశారు.కాబూల్ విమానాశ్రయానికి బయలుదేరిన భారతీయులందరికీ ఫోన్లు చేశారు. విమానాశ్రయానికి కాకుండా నేరుగా భారత దౌత్య కార్యాలయానికి రావాలని సమాచారమిచ్చారు.ఆ రాత్రికి ఆ 120 మంది భారతీయులంతా భారత దౌత్య కార్యాలయంలోనే నిద్రించారు.మరుసటిరోజు తెల్లవారుజామున 120 మందిని రెండు బ్యాచ్లుగా విభజించి.. 14 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో కాబూల్ విమానాశ్రయానికి తరలించారు.
మరోవైపు ఆఫ్గన్లో తాలిబన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. మహిళలు సైతం ధైర్యంగా రోడ్ల పైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. జలాలాబాద్ నగరంలో స్థానికులు తాలిబన్ల జెండా పీకేసి ఆ స్థానంలో ఆఫ్గన్ ప్రభుత్వ జెండా పెట్టారు. ఈ చర్యపై ఆగ్రహించిన తాలిబన్లు తమకు వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్నవారినపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications