రవి మృతి కేసు: ఈ నెల 28వ తేదీన రాష్ట్ర బంద్
బెంగళూరు: ఐఏఎస్ అధికారి రవి హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక బంద్ జరగనుంది. ఈనెల 28వ తేదిన శనివారం బంద్ నిర్వహిస్తామని పలు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. కన్నడ చళవళి వాటల్ పక్ష (కన్నడ పోరాట వాటల్ పార్టి) అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు వాటల్ నాగరాజ్ బంద్ కు పిలుపునిచ్చారు.
అఖిల కర్ణాటక డాక్టర్ రాజ్ కుమార్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సా.రా. గోవిందు తదితరులతో కలిసి వాటల్ నాగరాజ్ బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఈనెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా బంద్ నిర్వహిస్తామని చెప్పారు. అదే విధంగా బెంగళూరు నగరంలోని టౌన్ హాల్ దగ్గర నుండి ఫ్రీడం పార్క్ వరకు మౌనంగా ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు.
ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు సీబీఐతో దర్యాప్తు చేయించాలని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్న వయస్సులో పేదలకు దగ్గరై కష్టపడి పని చేస్తున్న ఐఏఎస్ అధికారి రవి ఈ విధంగా మరణించడం చాల బాధకరమని వాటల్ నాగరాజ్ అన్నారు.
ఐఏఎస్ అధికారి రవి కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నప్పటి నుండి ఆయన మరణించిన రోజు వరకు ఎవరెవరు ఆయనను ఇబ్బంది పెట్టారు, బెదిరించారు అనే విషయాలు పూర్తిగా బయటకు రావాలని పలు కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రవి మరణానికి కారణం అయిన వారిని చట్టపరంగా శిక్షించాలని మరో అధికారికి ఇలాంటి అన్యాయం జరకుండ చూడటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొవాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.