ట్యాబ్లెట్: శాంసంగ్కు ఐబాల్ షాక్, రెండో స్ధానానికి పడిపోయింది
న్యూఢిల్లీ: కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్కు గట్టి దెబ్బ తలిగిలింది. ట్యాబ్లెట్ల అమ్మకాల్లో ఇప్పటి వరకు నెంబర్ వన్ స్ధానంలో దూసుకుపోతున్న కంపెనీకి భారత్కు చెందిన ఐబాల్ వెనక్కు నెట్టింది.
అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఐబాల్ 15.6 శాతం మార్కెట్ వాటాతో తొలి స్థానం దక్కించుకుందని అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఐడీసీ తెలిపింది. గత ఏడాది మూడో త్రైమాసికంలో 22.2 శాతంతో ఉన్న శాంసంగ్ ఆ తర్వాతి త్రైమాసికానికి 12.9 శాతానికి పడిపోయిందని వెల్లడించింది.
2013 నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా ఉన్న ఐబాల్ మార్కెట్ వాటా ఏడాది కాలంలోనే మూడు రెట్లు పెరగడం విశేషం. గడిచిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 9.6 లక్షల ఐబాల్ యూనిట్లు అమ్ముడయ్యాయని ఐడీసీ నివేదకను విడుదల చేసింది.
దేశీయంగా చౌకైన ట్యాబ్లెట్లపై ఐబాల్ దృష్టి సారించడం వల్లనే మొదటి స్థానం చేజిక్కించుకోవడానికి కారణమైందని ఐడీసీ పేర్కొంది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో గట్టి పోటీనిస్తున్న మైక్రోమ్యాక్స్ ట్యాబ్లెట్ల అమ్మకాల్లో 10.9 శాతం వాటాతో మూడో స్థానం దక్కించుకుంది.
ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా డేటావిండ్, లెనోవో, హెచ్పీలు ఉన్నాయి. మూడో త్రైమాసికంతో పోలిస్తే నాలుగో క్వార్టర్లో ట్యాబ్లెట్ల అమ్మకాలు 3.6 శాతం చొప్పున పెరిగినట్లు పేర్కొంది. గడచిన ఏడాదిలో భారత్లో అంత క్రితం ఏడాదితో పోలిస్తే 15 శాతం తగ్గి 35 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.