ఎక్కడైనా ఇడియట్లే, ఆడపిల్లగా పుట్టకూడదు: లేడీ ఐఏఎస్
న్యూఢిల్లీ: ‘అడుగడుగునా ఇడియట్లే ఉన్నారు. ఈ దేశంలో మహిళలు జన్మించకూడదని ప్రార్థిస్తాను' అని ఓ ఐఏఎస్ అధికారిణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్బుక్లో ఆమె చేసిన వ్యాఖ్యలు 48 గంటల్లో సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. ఎంతోమంది ఆమె వ్యాఖ్యలను అభినందిస్తూ లైక్ కొట్టగా, చాలా మంది వాటిని షేర్ చేసుకున్నారు.
తనకు అసభ్య సందేశాలు పంపిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడిపై ఐఏఎస్ అధికారి రీజు బాఫ్నా గతవారం లైంగిక వేధింపుల కేసు పెట్టారు. ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదుతోనే ఆ అధికారి ఉద్యోగం ఊడింది. కానీ అంతటితో కథ ముగిసిపోలేదు. కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా ఆమె తన ఫేస్బుక్ పోస్ట్లో వివరించారు.
కోర్టుకు తాను వెళ్లినప్పుడు డిఫెన్స్ న్యాయవాది, మరికొందరు అక్కడ ఉన్నారని, వారందరి ఎదుట వాంగ్మూలం ఇవ్వటం ఇబ్బందికరంగా ఉందని, అందువల్ల వారందరినీ బయటకు వెళ్లాలని కోరానని తెలిపారు. ఇందుకు ఆ న్యాయవాది గట్టిగా అరుస్తూ ‘మీరు మీ ఆఫీసులో అధికారి కావచ్చు.. కానీ కోర్టులో కాదు' అని అన్నారని పేర్కొన్నారు.

తన ఆవేదనను జడ్జికి కూడా మొరపెట్టుకున్నానని తెలిపారు. లైంగిక వేధింపుల కేసులో ఓ మహిళ వాంగ్మూలం ఇస్తున్నప్పుడు ఆ పరిసరాల్లో ఉన్న వ్యక్తుల పట్ల జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరాను. ఇందుకు ఆయన ‘మీరు యౌవనదశలో ఉన్నారు కాబట్టి అటువంటి డిమాండ్ చేస్తున్నారు' అని వ్యాఖ్యానించారని తెలిపారు.
ఈ దేశంలో మహిళల ఇబ్బందులను ఎవరూ పట్టించుకోరని, అడుగడుగునా ఇడియట్లే ఉన్నారని, అందువల్ల అసలు స్త్రీలు ఈ దేశంలో పుట్టకూడదని ప్రార్థిస్తానని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications