యూపీ ముఖ్యమంత్రిగా అసదుద్దీన్ ఓవైసీ -బీఎస్ఎంతో కలిసి 100 సీట్లలో -యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీకి బీ-టీమ్ గా, బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చే ఓట్ కట్టర్ గా ''ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)'' చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విపక్షాలన్నీ విమర్శలు చేయడం సాధారణం అయిపోయింది. ఎవరు ఏరకంగా తిట్టిపోసినా, మజ్లిస్ చీఫ్ మాత్రం హైదరాబాద్ వెలుపల తన పార్టీని విస్తరించుకుంటూ పోతున్నారు. మహారాష్ట్రలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సాధనతో మొదలైన ఎంఐఎం విజయపరంపర గతేడాది బీహార్ ఎన్నికల వరకూ సాగింది.
ఈ ఏడాది బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం ఓవైసీ తుస్సుమన్నారు. అయినాసరే, బీజేపీకి, విపక్ష ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ లకు సవాలు విసురుతూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం భారీ ఎత్తున అభ్యర్థులను బరిలోకి దింపుతున్నది. మిత్రుల అంచనాల ప్రకారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ యూపీకి ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశముందట..
సీఎం యోగి సంచలనం
ఆమధ్య యూపీ గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దెబ్బతినడంతో సీఎం యోగి సమర్థతపై ఢిల్లీ స్థాయిలో చర్చ జరగడం, ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఆర్ఎస్ఎస్ పెద్దలంతా యూపీపై వరుస భేటీలు నిర్వహించడం, ఒక దశలో యోగికి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తెస్తారనే వార్తలు రావడం తెలిసిందే. కానీ తాజాగా వెలువడిన జిల్లా పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది.
మొత్తం 75 స్థానాలకుగానూ ఏకంగా 67 చోట్ల బీజేపీ గెలవడంతో యోగి మార్పుపై చర్చలు పటాపంచలయ్యాయి. ఇదే ఊపులో వచ్చే ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలపైనా సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని జాతీయ నేతగా కీర్తిస్తూ, ఆయన విసిరిసన సవాలును బీజేపీ స్వీకరిస్తున్నదనీ యోగి చెప్పారు.
దేశ్ కి నేత ఓవైసీ మాటను కాదంటామా
రెండ్రోజుల కిందట లక్నో శివారులో జరిగిన ఓ ర్యాలీలో మజ్లిస్ చీఫ్ ఓవైసీ మాట్లాడుతూ, యూపీలో బీజేపీని తిరిగి అధికారంలోకి రానీయబోమని, యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్యమంత్రి కావడం కలగానే మిగిలిపోతుందని అన్నారు. మిత్రపక్షాలతోకలిసి ఎంఐఎం కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే బీజేపీకి చుక్కలు చుపించడం సాధ్యమేనని అన్నారు. బీజేపీకి దమ్ముంటే తన సవాలును స్వీకరించాలనీ అసద్ వ్యాఖ్యానించారు.
దీనిపై సీఎం యోగి సైతం అదే స్థాయిలో స్పందించారు. ''ఓవైసీగారు మన దేశంలో ప్రముఖ నాయకుడు. అలాంటి వ్యక్తి సవాలు విసిరితే మేం కాదనగలమా? ఎంఐఎం ఛాలెంజ్ ను బీజేపీ కార్యర్తలు స్వీకరిస్తున్నారు. 2017లోకూడా ఇలాంటి సవాళ్లే విసిరి ఓవైసీ దెబ్బయిపోయారు. 2022 ఎన్నికల్లోనూ ఆయనకు పరాభవం తప్పదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా 300కుపైగా సీట్లు సాధించబోతున్నది'' అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇదిలా ఉంటే,
కేంద్ర కేబినెట్ విస్తరణ: వీరికే చోటు -5రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మోదీ, బీజేపీ కీలక అడుగులు
తొమ్మిది పార్టీలతో పొత్తు.. 100 సీట్లు..
కరోనా అనంతర పరిస్థితుల్లో దేశమంతటా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే అంచనాల నడుమ ఇంకొద్ది నెలల్లోనే ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనుండం, వాటిలో పంజాబ్ మినహా నాలుగు చోట్లా బీజేపీనే అధికారంలో ఉండటంతో ఆ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యూపీలో ఈసారి ఎంఐఎం ఏకంగా 100 సీట్లలో పోటీకి దిగుతున్నది.
తొమ్మిది చిన్న పార్టీలతో ఏర్పడిన భాగీదారి సంకల్ప్ మోర్చా(బీఎస్ఎం)అనే కూటమితో ఎంఐఎం పొత్తు కుదుర్చుకుంది. బీఎస్ఎం కూటమికి సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్భర్ నాయకత్వం వహిస్తున్నారు. నాన్ లోకల్ ఓవైసీతో పొత్తు పెట్టుకుని ఏం సాధిస్తారని మీడియా అడిగిన ప్రశ్నలకు ఓం ప్రకాశ్ సంచలన సమాధానం ఇచ్చారు..
యూపీ సీఎంగా ఓవైసీ, ఇదే దారి..
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి కూడా కావొచ్చని, ఓవైసీ చేయాల్సిందల్లా యూపీ ఓటరుగా మారడమేనని ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్భర్ అన్నారు. ఓవైసీపై నాన్ లోకల్ విమర్శలకు సమాధానంగా యోగి ఆదిత్యనాథ్ ప్రాంతీయతను ప్రశ్నించారు ఓం ప్రకాశ్. ''ఉత్తరాఖండ్ కు చెందిన యోగి ఆదిత్యనాథ్ తర్వాతి కాలంలో ఉత్తరప్రదేశ్ ఓటరుగా మారి, ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
అలాంటిది హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి మాత్రం ఎందుకు దక్కదు? యూపీలో ఓటరుగా నమోదు అయితే ఆయన కూడా సీఎం కావొచ్చు'' అని ఎస్బీఎస్పీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో పొత్తును మాయావతి నో చెప్పడంతో అసద్ బీఎస్ఎంతో జతకట్టారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీలు ఒంటిగానే బరిలోకి దిగనున్నాయి. పొత్తుకు ఎవరూ ముందుకురాని నేపథ్యంలో కాంగ్రెస్ ది సైతం ఒటరిపోరే. విపక్షాల అనైక్యత, ఓట్ కట్టర్ ఓవైసీ 100 సీట్లలో పోటీతో అంతిమంగా బీజేపీకి లాభం చేకూరే అవకావం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.