చంపాలనుకుంటున్నారు కానీ బెదరను: తస్లీమా నస్రీన్
ఢిల్లీ: మతఛాందసవాదులు తనను చంపాలనుకుంటున్నారని, అయితే నేను వారిని ప్రతిఘటిస్తానని ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ శనివారం నాడు అన్నారు. తుది వరకు నేను మత చాంధసవాదులతో పోరాడుతానని చెప్పారు.
మతఛాందసవాదుల పట్ల మౌనం వహించబోనని, మరణించే వరకు ఆ దుష్ట శక్తులతో పోరాడుతూనే ఉంటానని ఆమె చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ఓ సాహిత్య కార్యక్రమంలో తస్లీమా నస్రీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తనకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నా, పనిపట్ల అతని చిత్తశుద్ధి అన్నా చాలా ఇష్టమని చెప్పారు. అయితే, ఆయన స్థానంలో తాను ఉండి ఉంటే భారత్ వదిలి వెళ్తానని మాత్రం చెప్పకపోయి ఉండేదానిని అని వ్యాఖ్యానించారు.
ఘర్షణలకు రచయితలు కారణం కాదన్నారు. మతఛాందసవాదులకు భయపడి నేను నా రచనలను ఆపేస్తే, ఛాందసవాదులు గెలిచినట్లవుతుందని, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోను వాటిని ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
కాగా, బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న ఘోరాలను ఆమె గతంలో ఓ పుస్తకం ద్వారా వెల్లడించారు. దానిని కొందరు అడ్డుకున్నారు. ఈ పుస్తకం నేపథ్యంలో ఆమె పైన దాడి ప్రయత్నాలు కూడా జరిగాయి. అదే సమయంలో ఇటీవల మత అసహనంపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలను ఒకింత తప్పుబట్టారు.