మేము కాదంటే హిందువులకు దిక్కెవరు?: ఇటలీకి పొమ్మంటారా?: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ లల్లో శరణార్థులుగా జీవిస్తోన్న హిందువులను భారత్ కు రప్పించడానికి పౌరసత్వ సవరణ చట్టానికి రూపకల్పన చేయాల్సి వచ్చిందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
హిందువులకు ఉన్నది ఒక్క భారతేనని, తాము కూడా కాదంటే వారు ఎక్కడికెళ్తారని ప్రశ్నించారు. ఆయా దేశాల్లో శరణార్థులుగా బతుకీడుస్తోన్న హిందువులకు భారత్ లో పౌరసత్వాన్ని కల్పించాల్సిన నైతిక బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని చెప్పారు. భారత్ ను కాదని హిందూ శరణార్థులు ఎక్కడికెళ్లగలరని ప్రశ్నించారు. ఇటలీకి పొమ్మంటారా? అక్కడికి వెళ్లినా.. ఆ దేశ ప్రభుత్వం వారికి పౌరసత్వాన్ని కల్పిస్తుందా? అని నిలదీశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక పరిస్థితులుక కారణమైన ఆందోళనకారులు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో స్పష్టం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. పొరుగు దేశాల్లో దుర్భర పరిస్థితుల్లో ఉన్న హిందువులకు మనదేశంలో పౌరసత్వాన్ని కల్పించడానికి వ్యతిరేకంగా వారు అల్లర్లు సృష్టిస్తున్నారని, దీని వెనుక కాంగ్రెస్ సహా 23 ప్రతిపక్ష పార్టీల ప్రమేయం ఉందని అన్నారు.
హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు పాకిస్తాన్ లో ద్వితీయ పౌరులుగా నివసిస్తున్నారని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం, వస్తు, సేవా పన్నుల చట్టాలను కలిపి రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారని, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను కూడా ఆయన తెలుసుకోలేకపోతున్నారని జీ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జీఎస్టీపై రాహుల్ గాంధీ చేస్తోన్న విమర్శలు.. ఆయన అపరిపక్వతను స్పష్టం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.