అలా చేస్తే.. అమ్మ ఆత్మ ఎప్పటికీ క్షమించదు: పన్నీర్కు జయకుమార్ హెచ్చరిక!
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత అక్కడి రాజకీయాలు ఎంతటి అనూహ్య మలుపులు తీసుకున్నాయో అందరికీ తెలిసిందే. గత సంవత్సర కాలం నుంచి అన్నాడీఎంకెలో ఈ అనిశ్చితి రాజకీయాల పరంపర కొనసాగుతూనే ఉంది.
కాలం కలిసిరాక జయలలిత నెచ్చెలి శశికళ జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. ఆర్కేనగర్ ఉపఎన్నికలో ఆమె మేనల్లుడు దినకరన్ సైతం అడ్డంగా దొరికిపోవడం ఆ పార్టీని మరింత ప్రభావితం చేసింది. దీంతో పార్టీని శాసించాలనుకున్నవాళ్లు కాస్త.. ఏకంగా ఉద్వాసనకు గురయ్యారు. తమ కనుసన్నుల్లో పనిచేస్తాడనుకున్న శశికళ అనుయాయి పళనిస్వామి.. పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు.

దినకరన్ను కలిసేది లేదు:
తాజాగా తమిళనాడు ఆర్థికమంత్రి జయకుమార్ సైతం అదే విషయాన్ని స్పష్టం చేశారు. బెయిల్ పై దినకరన్ బయటకు వచ్చిన వేళ.. ఆయన్ను కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇది తన ఒక్కడి మాట మాత్రమే కాదని, అన్నాడీఎంకె కార్యకర్తలు,నాయకులెవరూ ఆయన్ను కలవరని స్పష్టం చేశారు.

పళనిస్వామి నేతృత్వంలోనే
పళనిస్వామి నేతృత్వంలోనే తమ ప్రభుత్వం నడవనుందని, తమ వెనుక సూత్రధారులెవరూ లేరని జయకుమార్ పేర్కొన్నారు. ఇక అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ జనరల్ పదవుల విషయంలో ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుందన్నారు.
అంతా కలిసి పనిచేస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే పన్నీర్ సెల్వంతో చర్చలు జరిపామని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎప్పుడైనా సంసిద్దంగానే ఉన్నామన్నారు. పన్నీర్ వర్గం చర్చలు జరుపుతామంటే తామెప్పుడైనా సిద్దమేనని చెప్పుకొచ్చారు.

పన్నీర్ను అమ్మ ఆత్మ క్షమించదు:
త్వరలో శాసనసభకు ఎన్నికలు వస్తాయన్న పన్నీర్ వ్యాఖ్యలను జయకుమార్ తప్పుపట్టారు. అన్నాడీఎంకె ప్రభుత్వం రద్దు కావాలని కోరుకోవడం.. అమ్మ ఆత్మను క్షోభకు గురిచేయడమేనని, అలా చేస్తే ఆమె ఆత్మ క్షమించబోదని హెచ్చరించారు. తన వర్గంలో పదవులు లేని నేతలను సంతృప్తి పరిచేందుకే పన్నీర్ సెల్వం అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
మళ్లీ ఎన్నికలంటూ జరిగితే 2021లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజలు కూడా మళ్లీ ఎన్నికలు జరగాలని కోరుకోవడం లేదన్నారు. పన్నీర్ సెల్వం వర్గంలో ఆయనతో విభేదిస్తున్న నేతలు తమతో టచ్ లో ఉన్నారని, వారంతా తిరిగి పార్టీలోకి రావడానికి సిద్దంగా ఉన్నారని జయకుమార్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications