ఉన్మాది ఘాతుకం: ప్రేమిస్తున్నానంటూ వైశాలి ప్రాణం తీశాడు
ఆమెను ప్రేమించానంటున్నాడు కానీ, ఆమె ప్రాణమే తీశాడు. అది ప్రేమేనా? లేక ఉన్మాదమా? అంటే అది ముమ్మాటికీ ఉన్మాదమనే చెప్పాలి.
జైపూర్: ఆమెను ప్రేమించానంటున్నాడు కానీ, ఆమె ప్రాణమే తీశాడు. అది ప్రేమేనా? లేక ఉన్మాదమా? అంటే అది ముమ్మాటికీ ఉన్మాదమనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రేమ ప్రాణం పోస్తుంది కానీ, తీయదు కదా! రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్వారాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు ఈ దుర్మార్గుడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. బన్స్వారా పట్టణానికి చెందిన వైశాలి(18) ఇటీవలే ఇంటర్మీడియట్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని కలల కంటోంది. ఈ క్రమంలోనే ఆమె పక్కింట్లో ఉండే జగదీష్ అనే యువకుడు ఆమెను తరచూ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసేవాడు.
దీంతో కుటుంబసభ్యలతో వైశాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం వైశాలి ఇంటి పనులు చేసుకుంటుండగా, గోడ దూకి లోపలికి వచ్చిన జగదీష్.. అత్యంత పాశవికంగా వైశాలి గొంతుకోసి పరారయ్యాడు. ఇంటి రెండో అంతస్తులో ఉన్న దివ్యాంగుడైన తండ్రి కిందికి వచ్చేలోగా వైశాలి రక్తపు ముడుగులో పడిపోయి ఉంది.
చుట్టుపక్కల వారి సాయంతో వైశాలిని ఆస్పత్రికి తరలించారు ఆమె తండ్రి. కానీ, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో వైశాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు జగదీష్ను అరెస్ట్ చేశారు.
తన ప్రేమను అంగీకరించని కారణంగానే వైశాలిని చంపేసినట్లు, తనకు దక్కనది వేరొకరికి దక్కనీయకూడదన్న ఆలోచనతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు జగదీష్ పోలీసులకు తెలిపాడు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబసభ్యుడు డిమాండ్ చేశారు.