2024లో బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరు? - అమిత్ షా క్లారిటీ
రాయ్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్ష యూపీఏకు ఇది అత్యంత కీలకమైన సంవత్సరం. ఈ ఏడాదే ఎనిమిది రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు- ఇవి సెమీ ఫైనల్ గా భావిస్తోన్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఎన్డీఏ, యూపీఏ సన్నద్ధమౌతోన్నాయి. ఈ నెల నుంచే ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాయి.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలివే..
కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో అయిదు, ద్వితీయార్థంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు షెడ్యూల్ కానున్నాయి. ఫిబ్రవరి-మార్చి నెలల్లో తొలి అయిదింటికీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది మినీ సార్వత్రిక ఎన్నికలను తలిపిస్తోన్నాయి.
ఛత్తీస్ గఢ్ లో అమిత్ షా..
ఈ పరిణామాల మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇవ్వాళ ఛత్తీస్ గఢ్ లో పర్యటించారు. కోర్బాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం ఇది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులే.. తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టామని, ఫలితంగా అశాంతియుత వాతావరణాన్ని తొలగిపోయిందని పేర్కొన్నారు.
మళ్లీ ఆయనే..
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో- ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలంటే- 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. మోదీని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని తేల్చి చెప్పారు.
మోదీ ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా..
ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకుని రావాలని- తద్వారా దేశం మొత్తం మోదీ నాయకత్వాన్ని కోరుకుంటోందనే సంకేతాలను ఇవ్వాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా హిందీ భాషలో మాట్లాడతారని, దేశం పట్ల తనకు ఉన్న అచంచలమైన భక్తి భావాన్ని ఆయన ఈ విధంగా చాటుతుంటారని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అలా జరిగేది కాదని విమర్శించారు.
2024 కంటే ముందే..
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోఉన్నప్పుడు ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు తీవ్రవాదం పెద్ద ఎత్తున అల్లకల్లోలానికి కారణమైందని, మందుపాతరల ద్వారా అశాంతియుత వాతావరణాన్ని సృష్టించిందని ఆరోపించారు. ఛత్తీస్ గఢ్ లో వేళ్లూనుకుపోయిన నక్సలిజం, మావోయిస్టు తీవ్రవాదాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే నిర్మూలిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. దీనికి అవసరమైన చర్యలను 2014లోనే ప్రారంభించామని, వాటిని మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.