ఎంటెక్ విద్యార్థినులకు వేధింపులు: ఐఐటి ప్రొఫెసర్పై చర్యలు
భువనేశ్వర్: ఎంటెక్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఫ్రొఫెసర్పై చర్యలు తీసుకునేందుకు ఐఐటి భువనేశ్వర్(ఐఐటి బిబిఎస్) బోర్డు సిద్ధమైంది. న్యూఢిల్లీలో డిసెంబర్ నెలలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్(బిఓజి) మీటింగ్ జరిగిన అనంతరం నిందిత ప్రొఫెసర్పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ వారం చివరిలో అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఎస్కె రూంగ్టా ఆధ్వర్యంలో జరిగిన బిఓజి సమావేశంలో ఏడుగురు సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిందిత ఫ్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఐఐటి బిబిఎస్ డైరెక్టర్ సుజిత్ రాయ్ మాట్లాడుతూ.. ఈ కేసుకు తార్కిక ముగింపు లభించిందన్నారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదుపై విచారణ ముగిసిన అనంతరం సదరు ప్రొఫెసర్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదొక ముగిసిన అంకమని ఆయన తెలిపారు. సదరు ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడతున్నాడంటూ బాధిత విద్యార్థినులు ఏప్రిల్ 27, 2014న ఐఐటి డైరెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఆ ప్రొఫెసర్ తన కోరిక తీర్చాలని తరచూ తమ గదుల వద్దకు రాత్రిళ్లు కూడా వచ్చేవాడని బాధిత విద్యార్థులను తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కోరిక తీర్చని పక్షంలో తక్కువ మార్కులు వేసి మీ జీవితాలను నాశనం చేస్తానని బెదిరింపులకు దిగేవాడని వారు తెలిపారు. దీంతో అతనిపై విచారణ చేపట్టిన ఐఐటి భువనేశ్వర్.. నిందిత ప్రొఫెసర్ను సెలవుపై పంపించివేసింది. ఆరోణలు నిజమైతే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications