7వ అంతస్తు నుంచి దూకిన ఐఐటీ బాంబే విద్యార్థి: నిరాశలో ఉన్నానంటూ సూసైడ్ నోట్
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐఐటీ బాంబేకు చెందిన దర్శన్ మాలవీయ అనే విద్యార్థి(26) సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీజీ రెండో సంవత్సరం చదువుతున్న దర్శన్ మాళవీయ సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు హాస్టల్ భవనం ఏడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. దర్శన్ అచేనంగా పడివుండటంతో గమనించిన అక్కడి వాచ్మన్ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు తెలియజేశారు.
వెంటనే అతడ్ని ఘట్కోవర్ లోని రాజాపడి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, దర్శన్ హాస్టల్ గదిలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని అందులో దర్శన్ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
తాను గత కొంతకాలంగా నిరాశలో ఉన్నానని, దానికి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు దర్శన్ మాళవీయ. కాగా, ప్రమాదవశాత్తు జరిగిన మరణం కింద దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్శన్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన విషయాన్న దర్శన్ కుటుంబసభ్యులకు తెలియజేశారు.