హైకోర్టు చీవాట్లు.. సీఎం హెచ్చరిక.. వెనక్కి తగ్గిన వైద్యులు
ముంబై హైకోర్టు చీవాట్లు, సీఎం హెచ్చరికలతో ముంబై వైద్యులు ఎట్టకేలకు ఆందోళన విరమించి విధుల్లో చేరేందుకు శుక్రారం సాయంత్రం అంగీకరించారు.
ముంబై: కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న మహారాష్ట్ర వైద్యులపై ముంబై హైకోర్టు మండిపడింది. వెంటనే విధుల్లో చేరాలని నిన్న ఆదేశించినప్పటికీ చాలామంది వైద్యులు ఇంకా విధుల్లో చేరకపోవడం పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్(ఎంఏఆర్డీ) సంఘాన్ని, వైద్యులను హైకోర్టు మందలించింది. ఇంకా సమ్మె చేసే వైద్యులపై ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని తెలుపుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల లోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని ఎంఏఆర్డీని ఆదేశించింది.

135 మంది రోగులు మృతి...
అత్యవసర సేవలకు కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల బృహాన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) లోని మూడు ఆసుపత్రుల్లో కలిపి 135 మంది రోగులు మరణించినట్లు బీఎంసీ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

దిగిరాకపోతే కోర్టు ధిక్కార కేసు...
ఒకవేళ కోర్టు ఆదేశాలు ఏంఏఆర్డీ పాటించకపోతే సంఘం అధ్యక్షుడు, కార్యదర్శిపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎంఏఆర్డీ అఫిడవిట్ దాఖలు చేసింది. రేపు 8 గంటల లోగా వైద్యులు విధులకు హాజరవుతారని కూడా హామీ ఇచ్చింది.

రోగి బంధువుల దాడి నేపథ్యంలో...
ఇటీవల ముంబైలోని సియాన్ ఆసుపత్రిలో ఓ డాక్టర్ పై రోగి బంధువులు దాడి చేసిన నేపథ్యంలో రెసిడెంట్ డాక్టర్లు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ రేపు వైద్యులు విధులకు హాజరవకపోతే ప్రభుత్వం, బీఎంసీ తగిన చర్యలు తీసుకుంటుందని హైకోర్టు కూడా హెచ్చరించింది.

న్యాయపరమైన చర్యలు...
సమ్మె చేపడుతున్న మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్లపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ విధుల్లో చేరలేదని, వైద్యులు మొండిగా, కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే కనుక వ్యవహరిస్తే.. వెంటనే విధుల్లో చేరకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్రభుత్వం చూస్తూ కూర్చోదు..
‘‘అయిపోయిందేవో అయిపోయింది. ప్రజలు మిమ్మల్ని దైవంలా చూస్తారు.. రాక్షసుల్లా చూసే పరిస్థితి తెచ్చుకోవద్దు.. మీకు పూర్తి భద్రత కల్పిస్తామని మరోసారి హామీ ఇస్తున్నా
ఒకవేళ వైద్యులు ఈరోజు తిరిగి విధుల్లో చేరకపోతే... ప్రభుత్వం చూస్తూ కూర్చోదు. రోగులు మరణిస్తూ ఉంటే అలాగే వదిలేయలేం. చివరి ప్రయత్నంగా వైద్యుల సంఘం ప్రతినిధులతో మాట్లాడుతున్నా. సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే.. న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి..'' అని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ప్రకటించారు.

ఆందోళన విరమించిన వైద్యులు
ఆసుపత్రుల్లో గట్టి భద్రత కల్పిస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒకటికి రెండుసార్లు హామీ ఇవ్వడం, మరోవైపు హైకోర్టు తీవ్రంగా మందలించడం, ఇంకోవైపు వైద్యం అందక రోగులు మరణిస్తుండడం, శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు చూస్తామని.. సాయంత్రం 6 గంటలకల్లా వైద్యులు విధులకు హాజరుకాకపోతే న్యాయపరమైన చర్యలు ప్రారంభిస్తామని అడ్వకేట్ జనరల్ రోహిత్ డియో హెచ్చరించడంతో ఎట్టకేలకు ముంబై వైద్యులు మెట్టు దిగొచ్చారు. తమ ఆందోళన విరమించి విధులకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications