తొలిసారి: రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) తొలిసారి రూ. లక్ష కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.1.03లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది.
గత జులైలో కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ మేర వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సెటిల్మెంట్ అనంతరం ఏప్రిల్ నెలకు సీజీఎస్టీ కింద కేంద్రం రూ.32,493 కోట్లు, ఎస్ జీఎస్టీ కింద రాష్ట్రాలకు రూ. 40,257కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
జీఎస్టీ కింద 2017 ఆగస్టు నుంచి 2018 మార్చి వరకు రూ.7.19లక్షల కోట్లు వసూలయ్యాయి. అంటే నెలకు సరాసరి రూ. 89.885 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. జీఎస్టీ అమలైన గత జులైతో కలుపుకుంటే రూ.7.41లక్షల కోట్లు వసూలయ్యాయి.
ఇది ఇలా ఉండగా, కాంపోజిషన్ డీలర్లకు సంబంధించి త్రైమాసిక ఫైలింగ్కు కూడా ఇదే నెల గడువు కావడం గమనార్హం. మొత్తం 19.31లక్షల మంది డీలర్లలో 11.47లక్షల మంది క్వార్టర్లీ రిటర్నులు(జీఎస్టీ4) సమర్పించారని తెలిపింది. ఏప్రిల్ నెలకు గానూ వసూలైన 1.03లక్షల కోట్లలో వీరు రూ. 579కోట్లు చెల్లించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.