చరిత్రలో తొలిసారిగా.. హైకోర్టు సిట్టింగ్ జడ్జికి కోర్టు ధిక్కార నోటీసు
కోల్ కతా హైకోర్టు సిట్టింగ్ జడ్జి సీఎస్ కర్ణన్ కు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఈనెల 13న కోర్టు ముందు హాజరు కావాలని ఆయన్ని ఆదేశించింది.
ఢిల్లీ: ఓ హైకోర్టు సిట్టింగ్ జడ్జికి తొలిసారి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జీలతోపాటు మద్రాస్ హైకోర్టు జడ్జీలపై అవినీతి ఆరోపణలు గుప్పించిన కోల్ కతా హైకోర్టు జడ్డి సీఎస్ కర్ణన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మధ్యే పలువురు మాజీ, ప్రస్తుత జడ్జీలపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు సీఎస్ కర్ణన్. దీనిని సుమోటోగా స్వీకరించింది సుప్రీం ధర్మాసనం. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ సహా ఏడుగురు సీనియర్ జడ్జీల ధర్మాసనం ఈ ధిక్కరణ కేసులపై విచారణ జరుపుతోంది.
కర్ణన్ కు నోటీసు జారీ చేయడంతోపాటు ఆయనకు ఎలాంటి న్యాయ, పాలనాపరమైన పని అప్పగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 13న కోర్టు ముందు హాజరు కావాలని కర్ణన్ ను ఆదేశించింది.
అలాగే ఆయన స్వాధీనంలో ఉన్న అన్ని జ్యుడీషియల్, అడ్మినిస్ట్రేటివ్ దస్త్రాలను కోల్ కతా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు అందజేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల కాపీని జస్టిస్ కర్ణన్ కు పంపించాలని కూడా కోర్టు రిజిస్ట్రార్ ను కోరింది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చరిత్రలోనే ఏ సిట్టింగ్ జడ్జికి కూడా ఇలా కోర్టు ధిక్కార నోటీసు జారీ అవలేదు.
ఇతర జడ్జీలపై ఆరోపణలు చేస్తూ ప్రధానికి లేఖ రాసిన కర్ణన్ పై చర్యలు తీసుకొని సుప్రీంకోర్టు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని బుధవారం విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. గతంలోనూ కర్ణన్ వివాదాల్లో చిక్కుకున్నారు.
సుప్రీం కొలీజియం ఆయన్ని మద్రాస్ హైకోర్టు నుంచి కోల్ కతా హైకోర్టుకు బదిలీ చేసినా.. ఆ ఆదేశాలను కర్ణన్ పట్టించుకోలేదు. అయితే తరువాత క్షమాపణ చెప్పారు. ఆయన మద్రాస్ హైకోర్టు నుంచి వెళ్లిపోయినా.. ప్రభుత్వ వసతి గృహాన్ని మాత్రం ఖాళీ చేయలేదంటూ ఆ హైకోర్టు సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా వేసింది.