తొలి కేసు: మైనర్ బాలుడిపై పలుమార్లు యువతి రేప్, వీడియో తీసి బెదిరింపు
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలపై అనేక ఆకృత్యాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మైనర్ బాలుడి(16)పై 23ఏళ్ల యువతి అత్యాచారానికి పాల్పడింది. అంతేగాక, ఆ అఘాయిత్యాన్ని వీడియో తీసి తనను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు గురిచేసింది.
కాగా, సహరాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సహరాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది ఇలా ఉండగా, బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోస్కో) సెక్షన్ 7,8 లు, ఐపీసీ 386 సెక్షన్ల కింద నిందితురాలైన మహిళపై ఉత్తరప్రదేశ్ పోలీసులు రాష్ట్రంలోనే మొట్టమొదటి కేసు పెట్టారు.మైనర్ బాలుడిపై మహిళ అత్యాచారం జరిపిన ఘటనను వీడియో తీసి, దాన్ని బయటపెడతానని బెదిరించి బాలుడిని పలుసార్లు లైంగికంగా వేధించిందని పోలీసులు చెప్పారు.
తనను పెళ్లి చేసుకోకుంటే తనతో గడిపిన వీడియో క్లిప్పింగును ఆన్లైన్లో పెడతానని నిందిత మహిళ మైనర్ బాలుడిని బెదిరించిందని పోలీసులు తెలిపారు. ముందు బాధిత బాలుడి సోదరుడు మహిళ అత్యాచారం జరిపిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. నిందితురాలు మహిళ కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మహిళపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సహరాన్పూర్ స్టేషన్ ఆఫీసర్ పీయూష్ దీక్షిత్ చెప్పారు.
కాగా, మైనర్ బాలుడితో మహిళకు ప్రేమ వ్యవహారం ఉందని, పెళ్లి చేసుకోవాలని బాలుడిపై మహిళ ఒత్తిడి తీసుకువస్తే అతను తిరస్కరించాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని దీక్షిత్ తెలిపారు.