నేనూ బాధితుడినే: బరాక్ ఒబామా, మిచెల్లీ తప్పు చేయనివ్వదని..
న్యూఢిల్లీ: అమెరికాలో మైనారిటీ వర్గానికి చెందిన తాను స్వయంగా వివక్ష ఎదుర్కొన్నానని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. 'కొన్ని కొన్ని సందర్భాల్లో నేనూ వివక్ష ఎదుర్కొన్నాను. నల్లగా ఉండటమే ఇందుకు కారణం. నా మతం గురించి చర్చలు జరిపారు. ముస్లిం అన్నారు! క్రైస్తవుడు కాదన్నారు. అదేదో తప్పయినట్లుగా... నేను మరో మతం అనుసరిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు' అని ఉద్వేగంతో ఆయన ప్రసంగించారు.
సిరిపోర్ట్ ఆడిటోరియంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మహిళల ప్రాధాన్యం వివరిస్తూ... ఒబామా తన సతీమణి మిచెల్లీ, ఇద్దరు పిల్లల గురించి చెప్పారు. ‘నేను తెలివైన, ధైర్యవంతురాలైన మహిళను పెళ్లాడాను. నేను తప్పు చేసినప్పుడు మిచెల్లీ నిర్భయంగా చెబుతుంది. ఇక మాకు ఇద్దరు అందమైన పిల్లలు. మొత్తంగా... నా చుట్టూ తెలివైన, బలమైన మహిళలున్నారు' అని ఒబామా తెలిపారు.
‘మత ప్రాతిపదికన చీలిపోనన్ని రోజులు భారతదేశం విజయ పథంలో పయనిస్తూనే ఉంటుందని ఒబామా అభిప్రాయపడ్డారు. పరమత సహనం అవసరమన్నారు. ‘మీ రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం తన మనసుకు నచ్చిన మత విశ్వాసాన్ని ఆచరించేందుకు, దానిని ప్రచారం చేసేందుకు ప్రతి పౌరుడికీ సమానమైన హక్కు ఉంది. ప్రతి దేశంలోనూ మత స్వేచ్ఛను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి బాధ్యత కూడా! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల అసహనం, హింస, తమ మతానికి మద్దతుగా జరిపే ఉగ్రవాద చర్యలు పెచ్చరిల్లుతున్నాయి' అని ఒబామా పేర్కొన్నారు.
‘మతపరంగా మనల్ని విభజించేందుకు జరిగే అన్ని ప్రయత్నాలను తిప్పి కొట్టాలి' అని ఒబామా స్పష్టం చేశారు. ‘మనిషిలోని చీకటి కోణాలకు, లక్షణాలకు ఏ సమాజమూ అతీతం కాదు. అయితే... మతం వీటిని తరచూ ఉపయోగించుకుంటుంది' అని విశ్లేషించారు. మూడేళ్ల క్రితం తమ దేశంలో విస్కాన్సిన్లోని గురుద్వారాలో ఒక వ్యక్తి కాల్పులు జరిపి ఆరుగురు అమాయకులను పొట్టనపెట్టుకున్న సంగతి ఒబామా గుర్తు చేశారు. ‘మృతుల్లో భారతీయులు, అమెరికన్లూ ఉన్నారు. ఆ విషాదాన్ని మన దేశాలు రెండూ పంచుకున్నాయి' అన్నారు.

‘మన రెండు దేశాలూ ఉగ్రవాదంపై పోరాడుతున్నాయి. ప్రజల రక్షణ కోసం కలిసిమెలిసి ఉన్నాయి. ఇప్పుడు... కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మనం రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకుంటున్నాం' అని ప్రకటించారు. అమెరికన్లు పెద్దసంఖ్యలో భారత్కు రావాలని... ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవాలని ఒబామా ఆకాంక్షించారు.
భారత్ - అమెరికా సహజమైన భాగస్వాములని అన్నారు. ‘భారత్కు అమెరికా ఉత్తమ భాగస్వామి. మనం కలిస్తే మన ప్రజలకు మరింత మేలు జరుగుతుందని, మరిన్ని ఉద్యోగాలు వస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను' అని ఒబామా తెలిపారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో... ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛగా నౌకాయానం సాగాలి' అని తెలిపారు. ఈ వివాదం సమసిపోవాలని ఆకాంక్షించారు. అంతేకాదు, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత పాత్ర పెరగాలని, దీనిని తాము స్వాగతిస్తామని చెప్పారు. భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మరోమారు మద్దతు పలికారు.
చికిత్సకు అవకాశమున్న, నియంత్రించగలిగే వ్యాధుల కారణంగా చిన్నారులెవరూ మరణించరాదని ఒబామా ఆకాంక్షించారు. శాస్త్ర, వైద్య రంగంలో సాధించిన నైపుణ్యంతో వ్యాక్సిన్లు అభివృద్ధి చేయాలని సూచించారు. మనుషుల అక్రమ రవాణాను ‘ఆధునికకాలపు బానిసత్వం'గా అభివర్ణించారు. భారత్, అమెరికా ఉమ్మడిగా దీనిని నియంత్రించాలన్నారు.
తిరుగు పయనం
మూడు రోజుల భారత పర్యటనలో మధుర స్మృతులనెన్నింటినో మిగుల్చుకుని... అమెరికా అధ్యక్షుడు ఒబామా తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం ఉదయం ఒబామా దంపతులకు కేంద్ర మంత్రి పియూష్గోయల్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ తదితరులు వీడ్కోలు పలికారు.
‘ఎయిర్ ఫోర్స్ వన్'లోకి ప్రవేశించే ముందు ఒబామా, మిషెల్లీ ఇద్దరూ భారతీయ సంప్రదాయం ప్రకారం చేతులు జోడించి ‘నమస్తే' పెట్టారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం... ఒబామా దంపతులు మంగళవారం తాజ్మహల్ను సందర్శించాల్సి ఉంది. కానీ... సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాకు నివాళులు అర్పించడంతోపాటు, కొత్త రాజును కలిసేందుకు వీలుగా తాజ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. వారు భారత్ నుంచి నేరుగా సౌదీ వెళ్లారు.












Click it and Unblock the Notifications