ప్రధానిపై బిజెపి ఎంపీ సావిత్రిబాయి పూలే విమర్శలు
లక్నో:దేశంలో రిజర్వేషన్లు ఎత్తేయడానికి కుట్ర జరుగుతోందని ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ సావిత్రీబాయి ఫూలే సంచలన విమర్శలు చేశారు. దశాబ్దాల తరబడి ఇస్తున్న రిజర్వేషన్లపై సమీక్ష జరపాలని దేశంలో ఒక వర్గం కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తోందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బిజెపి ఎంపీగా ఉన్న సావిత్రిబాయి పూలే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరుకున పెట్టాయి. రిజర్వేషన్ల విషయమై బిజెపి వైఖరిపై ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సామిత్రి బాయి పూలే చేసిన వ్యాఖ్యలు యూపీ రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
రిజర్వేషన్ల అంశంపై బిజెపి ఎందుకు మౌనంగా ఉందని ఆమె ప్రశ్నించారు. దీనికి అర్ధమేమిటని ఆని ఆమె ప్రశ్నించారు. బహ్రెయిచ్ నుండి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రిజర్వేషన్ల పరిరక్షణ కోసం తన నియోజకవర్గంలో ఓ ర్యాలీ నిర్వహించారు. త్వరలోనే లక్నోలో ఓ మహ ప్రదర్శనను నిర్వహించనున్నట్టు కూడ ఆమె ప్రకటించారు.
అంతేకాదు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పదును తగ్గిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మోడీ సర్కార్ ఎందుకు తాత్సారం చేసిందని ఆమె ప్రశ్నించారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని ఆమె ప్రశ్నించారు.
లోక్జనశక్తి పార్టీ అధినేత రామ్విలాస్ పాశ్వాన్ కూడ ఈ విషయమై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు. పథకం ప్రకారం బిజెపి దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శలు చేశారు.