యోగి ఎఫెక్ట్: వేగంగా వెస్ట్ యూపీలోకి హిందు వాహిని
గుజరాత్ రాష్ట్రం గోద్రాలో 2002 ఏప్రిల్లో అల్లర్లు జరిగిన దాదాపు 15 ఏళ్లవుతున్నది. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాడు కొద్ది మంది యువకులతో కలిసి హిందూ యువ వాహిని పేరిట సాంస్క్రుతిక సంస్థ
మీరట్: గుజరాత్ రాష్ట్రం గోద్రాలో 2002 ఏప్రిల్లో అల్లర్లు జరిగిన దాదాపు 15 ఏళ్లవుతున్నది. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాడు కొద్ది మంది యువకులతో కలిసి హిందూ యువ వాహిని పేరిట సాంస్క్రుతిక సంస్థను ఏర్పాటు చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రైవేట్గా తయారు చేసిన ఈ ఆర్మీకి సొంత నిబంధనావళితో క్రమంగా వేల మంది సభ్యులతో పూర్వాంచల్ ప్రాంతంలో ఎదురులేని శక్తిగా నిలిచింది. యోగి ఆదిత్యనాథ్ ఆధిపత్యానికి గుర్తుగా అవతరించింది.
గత 15 ఏళ్ల వరుస విజయాల తర్వాత ఈనాడు యూపీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న సాంస్క్రుతిక సంస్థ పట్ల యువతలో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ప్రత్యేకించి పశ్చిమ యూపీ బెల్ట్లో విస్తరణ దిశగా ముందుకు సాగుతున్నది. సంస్థ వ్యవస్థాపకుడే సీఎంగా ఉండటంతో సహజ సిద్ధంగానే యువతలో పెరుగుతున్న ఆసక్తి కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘ్యేతర సంస్థగా 'హిందూ యువ వాహిని' ఎదుగుతోంది.
కొత్త సభ్యుల చేరికతో హిందు యువ వాహిని బిజీబిజీ
కేవలం మీరట్ జిల్లాలోనే హిందూ యువ వాహిని జిల్లా అధ్యక్షుడు నిత్యం కొత్త సభ్యులను చేర్చుకుంటున్నాడు. కేవలం వారం రోజుల గడువులోపే వందల సంఖ్య నుంచి వేల సంఖ్యకు పెరుగుతున్నది. ఈ నెలాఖరు నాటికి మీరట్ జిల్లాలోనే నాలుగు వేల మందిని సభ్యులను చేర్చుకుంటామని సంస్థ జిల్లా అధ్యక్షుడు సచిన్ మిట్టల్ తెలిపారు. సచిన్ మిట్టల్ నివాసమే ప్రస్తుతం సంస్థ జిల్లా ప్రధాన కార్యాలయంగా మారిపోయింది.
పూర్వాంచల్ నుంచి వెస్ట్ యూపీ దిశగా విస్తరణ
ఇప్పటివరకు పూర్వాంచల్ ప్రాంతానికి పరిమితమైన హిందూ యువ వాహిని జెండాను పశ్చిమ యూపీ బెల్టులోకి తీసుకెళ్లేందుకు సచిన్ మిట్టల్ సమయాత్తమవుతున్నారు. మీరట్ చుట్టు పక్కల జిల్లాల నుంచి భారీగా యువత వచ్చి చేరుతున్నారు. అంతకుముందు పంట పొలంలో పని చేసుకునే సచిన్ మిట్టల్ దిన చర్య.. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ నియమితులైన తర్వాత పూర్తిగా మారిపోయింది. నిత్యం హిందూ యువ వాహినిలో చేరతామని వచ్చే రిక్వెస్ట్లు, ఫోన్ కాల్స్తో బిజీబిజీగా గడుపుతున్నారు.
త్వరలో సభ్యత్వం లక్షలు దాటే అవకాశం
పరిస్థితి ఇలాగే కొనసాగితే మీరట్ జిల్లాలో మాదిరిగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో లభిస్తున్న సానుకూల స్పందన చూస్తే ఈ నెలాఖరులోగా సంస్థ సభ్యత్వం లక్షలు దాటే అవకాశం ఉందని సచిన్ మిట్టల్ చెప్తున్నారు. తమ మాత్రు సంస్థ ఆరెస్సెస్ అని చెప్తున్న సచిన్ మిట్టల్.. హిందూ యువ వాహిని ఎదుగుదల పట్ల సంఘ్ పరివార్ సంస్థల్లో ఆందోళన వ్యక్తమవుతున్నదని తెలిపారు.
విమర్శలకు తావివ్వబోమంటున్న వాహిని శ్రేణులు
ఈ సందర్భంగా షామ్లీ జిల్లాకు చెందిన 25 ఏళ్ల కుర్రాడు మాట్లాడుతూ 'యోగీ జీ అధికారంలో ఉన్నందున మేం చాలా జాగ్రత్తగా ఉండాలి. విపక్షాలు, మీడియా మమ్ముల్ని మా చర్యలను చాలా సునిశితంగా పరిశీలిస్తుంటాయి. వారికి దాడి చేసే అవకాశం మేం ఇవ్వం. మా అధినేత, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్కు తలనొప్పులు తెచ్చి పెట్టం' అని వ్యాఖ్యానించాడు.యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత ప్రజాదరణకు అనుగుణంగానే సంస్థ సభ్యత్వం పెరుగుతున్నది.
ఏడేళ్లుగా యోగితో సచిన్ మిట్టల్ అనుబంధం
ఏడేళ్లుగా యోగితో తాను పని చేస్తున్నానని సచిన్ మిట్టల్ చెప్పారు. గతంలో ఢిల్లీలో యోగిని కలవడానికి వెళ్లాలంటే చాలా కొద్ది మంది మాత్రమే అందుబాటులో ఉండేవారన్నారు. కానీ ఇప్పుడు ప్రతి రోజూ యువత వచ్చి తమను సభ్యులుగా చేర్చుకోవాలని కోరుతున్నారని చెప్పారు. ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. యోగి ఆదిత్యనాథ్ చర్యలకు ఇప్పుడిప్పుడే గుర్తింపు వస్తున్నందున వారు వచ్చి తమ సంస్థలో సభ్యులుగా చేరుతున్నారని అన్నారు.
హిందుత్వతోనే ఆదిత్యనాథ్ ఎదుగుదల
అతివాద హిందుత్వ విధానంతోనే ఆదిత్యనాథ్ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. క్రైస్తవులను శుద్ధి చేసి హిందువులగా మార్చడం మొదలు లవ్ జిహాద్ పేరిట ముస్లింల వ్యతిరేక ప్రకటనలతో రాజకీయ పునరేకీకరణ చర్యల వరకు.. బీఫ్ తిన్నాడన్న ఆరోపణతో 2015లో మహ్మద్ అఖ్లాఖ్ అనే ముస్లిం ఇంటిపై దాడి చేసి యువకులు హత్య చేసిన ఘటన వరకు ప్రతి అంశంలోనూ యోగి ఆదిత్యనాథ్ ఎదుగుదల కనిపిస్తుంది. ఆయన ఎక్కడకు వెళ్లినా హిందూ యువ వాహిని అనుసరిస్తూ ముందుకు సాగుతుంటుంది. 2007 గోరఖ్ పూర్ అల్లర్ల సమయంలో హిందూ యువ వాహిని కార్యకర్తలే స్థానిక మసీదుకు నిప్పంటించి మతపరంగా ద్వేషపూరిత వైఖరి పెరుగుదలకు కారణం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోం
కానీ ప్రస్తుతం ఈ సంస్థ అధినేత రాష్ట్రానికి సీఎం కావడం హిందూ యువ వాహిని పాత్ర ఎలా ఉండబోతున్నది. ఈవ్ టీజర్ల ఆటకట్టించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్ల అధికారులు రాష్ట్రమంతా నిఘా పెంచడంతో వీరి దూకుడుకు అడ్డుకట్ట పడింది. సచిన్ మిట్టల్ తమకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని చెప్పారన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇంతకుముందు వీధుల్లో తాము పర్యటించే వారమన్నారు.
వాచ్ డాగ్స్ మాదిరిగా వ్యవహరిస్తామని వ్యాఖ్యలు
ప్రస్తుతం చాలా కష్టపడి పనిచేసే సీఎం తమకు ఉన్నందున పరిపాలనా యంత్రాంగం పనితీరులో తాము జోక్యం చేసుకోబోమని ఆశిష్ కపూర్ అనే హిందు యువ వాహిని కార్యకర్త తెలిపారు. తాము నిరంతరం వాచ్ డాగ్స్ మాదిరిగా వ్యవహరిస్తున్నామని, అధికారులు మిస్సయిన అంశాలను తాము పరిపూర్తి చేస్తామని చెప్పారు.
చట్ట విరుద్ధ కార్యకలాపాలను అడ్డుకుంటామంటున్నహిందూ వాహిని
యాంటీ రోమియో స్క్వాడ్లు మొదలు గో రక్షణ వరకు ఎక్కడ చట్ట విరుద్ధ కార్యకలాపాలు చోటు చేసుకున్నా తాము స్పందిస్తామని తెలిపారు. ఉదాహరణకు మీరట్ పట్టణంలోని సోతిగంజ్ ప్రాంతం మోటారు బైక్లు, కార్ల దొంగతనాలకు ప్రతీతి. దొంగిలించిన వాటిని ముక్కలుముక్కలుగా చేసి స్క్రాప్ కింద విక్రయిస్తుంటారు. తమకు సమాచారం తెలిసిన వెంటనే పలుసార్లు పోలీసుల ద్రుష్టికి తీసుకెళ్లామన్నారు.
సోతిగంజ్లోనే యోగి భేటీ
సోతిగంజ్ సహజంగా ముస్లింల ఆధిపత్యం గల ప్రాంతమని, యోగి ఆదిత్యనాథ్ను తాను అక్కడే కలుసుకునే వాడినని సచిన్ మిట్టల్ తెలిపారు. 2011, 2013, 2015 వరకు పలు సార్లు మీరట్కు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ భోజనం తమ ఇంట్లోనే ఉండేదని, ఆయన ఎంపీ కాక ముందు కూడా తనతో కలిసి ఉన్నాడని చెప్పాడు. తమ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు గోరఖ్ నాథ్ మఠంలో దళిత హెడ్ కుక్, ముస్లిం సర్వెంట్లతో అందిస్తున్న సేవలను వివరించడంతో తనకు మఠం పట్ల ఆసక్తి పెరిగేదన్నారు. ఏడేళ్లుగా తనతో ప్రజల సంబంధ బాంధవ్యాలు, ప్రస్తుత పరిస్థితి చాలా విభిన్నంగా ఉన్నదని తెలిపారు.