దేశ రాజధానిలో పేలుళ్లకు కుట్ర: జమ్మూ యువకుడి అరెస్ట్, 8గ్రనెడ్లు స్వాధీనం
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఆ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పేలుళ్ల కుట్రలో నిందితుడిగా ఉన్న ఓ కశ్మీరి యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ నుంచి ఢిల్లీ బయలుదేరే బస్సులో ఆదివారం రాత్రి ఓ యువకుడు ఎనిమిది గ్రనేడ్లు, రూ.60, 580ల నగదుతో ఓ బస్టాప్ నుంచి బయలుదేరాడు.
బస్సు గాంధీనగర్ సమీపంలోనికి రాగానే భద్రతా బలగాలు ఆ బస్సును ఆపి తనిఖీలు నిర్వహించాయి. యువకుడి వద్ద గ్రనేడ్లు, నగదును స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకొన్నారు.
పట్టుబడిన నిందితుడికి ఎలాంటి మిలిటెంట్ నేపథ్యం లేదని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, ఉగ్రవాదులకు సహకరిస్తున్న నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీకి వచ్చే రాకపోకలపై అధికారులు కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.