కాబూల్ నుంచి ఢిల్లీకి రోజుకు రెండు విమానాలు... భారత్కు అమెరికా నాటో దళాలు గ్రీన్ సిగ్నల్...
ఆఫ్గనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎప్పుడెప్పుడు స్వదేశానికి చేరుకుంటామా అని ఎదురుచూస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో త్వరగా అక్కడి నుంచి బయటపడాలని భావిస్తున్నారు. తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ను ఆక్రమించాక అక్కడి ఎయిర్ స్పేస్ను మూసివేయడంతో... భారతీయుల తరలింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. అమెరికా నాటో దళాల సహకారంతో ప్రస్తుతం ప్రత్యేక విమానాల్లో తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ చర్యలను మరింత వేగవంతం చేసేలా... తాజాగా అమెరికా నాటో దళాలు రోజుకు రెండు విమానాలు నడిపేందుకు భారత్కు అనుమతినిచ్చాయి.
ఇక నుంచి కాబూల్లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రోజుకు రెండు విమాన సర్వీసులు నడవనున్నాయి. తద్వారా భారతీయ తరలింపు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్లో మరో 300 పైచిలుకు మంది భారతీయులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆఫ్గనిస్తాన్లోని వివిధ ప్రాంతాల నుంచి కాబూల్కి చేరుకోలేకపోయిన భారతీయుల సంఖ్య కూడా ఎక్కువే ఉండొచ్చుననే వాదన ఉన్నది. ఈ వారంలో దాదాపు 180 మందిని ఆఫ్గనిస్తాన్ నుంచి భారత్కు తరలించారు. 90 మందితో కూడిన మరో విమానం శనివారం(ఆగస్టు 21) కాబూల్ నుంచి బయలుదేరగా... ఈ రాత్రికి అది ఢిల్లీ చేరనుంది.

కాబూల్ విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తున్న 150 మంది భారతీయులను తాలిబన్లు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వారిని తాలిబన్ల చెర నుంచి విముక్తి చేసేందుకు భారత ప్రభుత్వ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా,నాటో దళాలు కాబూల్ విమానాశ్రయం నుంచి 25 విమానాలను ఆపరేట్ చేస్తున్నాయి.అమెరికన్ పౌరులతో పాటు తమ ఆయుధాలను,మిలటరీ ఎక్విప్మెంట్ను విమానాల్లో అమెరికాకు తరలిస్తున్నారు. చరిత్రలో ఇంత సంక్లిష్టమైన తరలింపు ప్రక్రియ ఇదే మొదటిసారి అని ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఆఫ్గన్లో చిక్కుకుపోయిన అమెరికన్ పౌరులను స్వదేశానికి తీసుకొస్తామని ఆయన తెలిపారు. అయితే అంతిమ ఫలితం ఎలా ఉంటుందనే దానికి తాను గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పారు.
Recommended Video
ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయం వద్ద ఆఫ్గన్లతో సహా అక్కడ చిక్కుకుపోయిన ఇతర దేశస్తులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. విమానాశ్రయం అమెరికా,నాటో దళాల నియంత్రణలో ఉండగా... విమానాశ్రయం బయట తాలిబన్ల నియంత్రణ కొనసాగుతోంది. ఆఫ్గనిస్తాన్ను పూర్తిగా ఆక్రమించుకున్న తర్వాత ఏర్పాటు చేసిన మొదటి ప్రెస్మీట్లో తాలిబన్లు శాంతి వచనాలు వల్లించినప్పటికీ... ప్రస్తుత పరిస్థితులు మాత్రం అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల హక్కులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తాలిబన్లపై ఆఫ్గన్ ప్రజల తిరుగుబాటు కొనసాగుతోంది. ఇప్పటికే బాగ్లన్ ప్రావిన్స్లోని మూడు జిల్లాలను అక్కడి ప్రజలు తాలిబన్ల నుంచి విముక్తి చేయగలిగారు. ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ పంజ్షేర్ ప్రావిన్స్లో తాలిబన్లను ఎదుర్కొనే వ్యూహాలపై సమాలోచనలు జరుపుతున్నారు. సాయుధ పంథాలోనే తాలిబన్లను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications