పాక్ కు సిగ్గు, లజ్జ లేదు: ఐరాసలో నిప్పులు చెరిగిన భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్ పై భారత్ నిప్పులు చెరిగింది. పాకిస్తాన్ కాశ్మీర్ అంశంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడారని మండిపడింది.
71వ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారత్ హాజరైయ్యింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ తన వాదనను వినిపించింది. ప్రపంచంలో తీవ్రవాదానికి పాకిస్తాన్ కేంద్ర బిందువు అయ్యిందని భారత్ చెప్పింది.
అలాంటి పాకిస్తాన్ భారత్ లోని కాశ్మీర్ లో శాంతి భద్రతలు అదుపుతప్పాయని అంటూ మానవహక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడింది. అంతర్జాతీయంగా అందుతున్న సహాయసహకారాలను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తున్నదని భారత్ గుర్తు చేసింది.
అంతర్జాతీయంగా అందుతున్న సహాయసహకారాలతో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు తీవ్రవాద శిక్షణ ఇస్తున్నదని, వారిని పెంచిపోషిస్తున్నదని, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా కర్యకలాపాలు సాగిస్తున్నదని భారత్ విరుచుకుపడింది.
ఉగ్రవాద సంస్థలను నడిపిస్తున్న ఉగ్రనాయకులు పాకిస్తాన్ లో బహిరంగంగా, స్వేచ్చగా తిరుగుతున్నా పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత్ ఐక్యరాజ్య సమితిలో చెప్పింది. తీవ్రవాది, హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వానీని ఐక్యరాజ్యసమితి సాక్షిగా అమరవీరుడు అని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పడం సిగ్గుచేటు అని భారత్ చెప్పింది.
తీవ్రవాదులను అమరవీరులుగా కీర్తించడం ఒక్క పాకిస్తాన్ కే చెల్లుతుందని, అలాంటి సిగ్గుమాలిన పని భారత్ చెయ్యదని చెప్పింది. పాకిస్తాన్ అణ్వాయుధ వ్యాప్తికి కృషి చేస్తూ శాంతి సామరస్యాల గురించి నీతి కథలు చెబుతున్నదని ఎద్దేవ చేసింది.
భారత్ తోనే కాక అంతర్జాతీయ సమాజానికి ఉగ్రవాదంపై పాక్ తప్పుడు వాగ్దానాలు చేసిందని, శాంతిని తుంగలో తొక్కుతోందని ఆరోపించింది. తీవ్రవాద భావజాలమున్న యువతను ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ ఆకర్షిస్తుందని భారత్ మండిపడింది.
కాశ్మీర్ లో తీవ్రవాద చర్యల నుంచి భారత పౌరులను రక్షించడానికి భారత్ సిద్దంగా ఉందని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ ను ఉగ్రవాదుల అడ్డగా మార్చేసిందని, బయటమాత్రం మాదినీతివంతమైన దేశం, మిగతా దేశాలు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నాయని పిట్టకథలు చెబుతున్నదని భారత్ మండిపడింది.
నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలను ఎండగడుతూ భారత్ చేసిన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అగ్రదేశాల నాయకుల దగ్గర కాశ్మీర్ అంశం ప్రస్తావించడం, సరైన విధంగా ఆదేశాధినేతలు స్పందించకపోవడంతో నవాజ్ షరీఫ్ అయోమయంలో పడ్డాడు.