INDIA కూటమి సమన్వయ కమిటీ ఏర్పాటు-లోగో వాయిదా-త్వరలో సీట్ల పంపకాల చర్చ..
ముంబైలో వరుసగా రెండో రోజు జరుగుతున్న విపక్ష ఇండియా కూటమి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మరికొన్ని కీలక నిర్ణయాల్ని వాయిదా కూడా వేశారు. కూటమిని పటిష్ఠంగా ఉంచడంతో పాటు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా 13 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. లోగో విడుదలపై భిన్నాభిప్రాయాలు రావడంతో వాయిదా పడింది. అలాగే త్వరలో సీట్ల సర్దుబాట్లపై చర్చించనున్నట్లు కూటమి నేతలు ప్రకటించారు.
ముంబయిలో మూడవ సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని కూటమి తీర్మానాన్ని ఆమోదించింది మరియు సభ్య పార్టీల మధ్య సీట్ల పంపకం చర్చలు "వెంటనే" ప్రారంభమవుతాయని పేర్కొంది.

ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న 13 మంది సభ్యుల సమన్వయ కమిటీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్సిపి చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత , బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సమాజ్వాదీ పార్టీ నుంచి జావేద్ ఖాన్, జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఉన్నారు. అయితే ఈ కమిటీకి నాయకుడిని మాత్రం ప్రకటించలేదు.
మరోవైపు ఇండియా కూటమి సమావేశం సందర్భంగా విడుదల చేసిన తీర్మానంలో.. సభ్య పార్టీలు సాధ్యమైనంత వరకు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలలో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు తక్షణమే ప్రారంభించబడతాయని తెలిపారు. అలాగే ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వీలైనంత త్వరగా ఈ చర్చలు ముగుస్తాయని కూడా తెలిపారు. తద్వారా రాష్ట్రాల్లో పొత్తుల చర్చలు పూర్తి చేసుకుని వచ్చే భేటీలో ప్రకటించే అవకాశాలున్నాయి.

మరోవైపు దేశంలో జమిలి ఎన్నికలపైనా ఇవాళ్టి ఇండియా కూటమి భేటీలో ప్రస్తావన వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ప్రతిపక్షాల భారత కూటమి బలం పాలక ప్రభుత్వాన్ని వణుకు పుట్టిస్తోందన్నారు. ఈ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాల వల్ల రానున్న నెలల్లో మరిన్ని దాడులు, అరెస్టులకు మనం సిద్ధంగా ఉండాలని ప్రతిపక్ష నేతలతో అన్నారు.అలాగే ఇండియా కూటమిలో పార్టీలు.. చంద్రయాన్ 3 విజయంపై ఇస్రోను అభినందించాయి. సోలార్ మిషన్ ఆదిత్య-L1 ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కూడా ప్రకటించాయి. అంతరిక్ష సంస్థ యొక్క అసాధారణ విజయాలు సైన్స్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపాయి.












Click it and Unblock the Notifications