అక్కడ సంతకం పెట్టని వైసీపీ
No Confidence Motion: ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా బ్లాక్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సభను నడిపించే విషయంలో ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.
పార్లమెంట్ ఉభయ సభలనూ కొద్దిరోజులుగా అదాని అంశం కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. లోక్సభ, రాజ్యసభల్లో దీనిపై సమగ్ర చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టి కూర్చున్నాయి. లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్.. దీనికి అనుమతి ఇవ్వట్లేదు. ఫలితంగా ఉభయ సభల కార్యకలాపాలూ స్తంభించిపోతూ వస్తోన్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.

ఈ క్రమంలో ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్పై అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ఎక్కుపెట్టింది ఇండియా బ్లాక్. తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను ఏవీ కూడా సభలో ప్రవేశపెట్టడానికి అంగీకరించట్లేదని, ఏ ఒక్క అంశంపైనా సమగ్రంగా చర్చను నిర్వహించడానికి జగ్దీప్ ధన్కర్ అనుమతి ఇవ్వట్లేదని ఇండియా బ్లాక్ ఆరోపిస్తోంది. సభ్యులను విభజిస్తోన్నారంటూ మండిపడింది.
ఈ క్రమంలో ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మినహా తమకు మరో గత్యంతరం కనిపించలేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ తేల్చి చెప్పారు. దీనిపై ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం బాధాకరమే అయినప్పటికీ- పార్లమెంట్ విలువలను కాపాడటానికి, రాజ్యంగ పరిరక్షణ, సభ్యల హక్కుల కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.
ఇండియా బ్లాక్కు చెందిన 60 మందికి పైగా సభ్యులు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే పార్టీలకు చెందిన సభ్యులు ఉన్నారు. సంతకాలు చేసిన ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఛైర్మన్ సెక్రెటేరియట్కు అందజేశారు.
కాగా- దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతకం పెట్టలేదు. ఆ పార్టీకి చెందిన పార్లమెంటరీ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డిని సంప్రదించినప్పటికీ ఆయన సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. తాము దేశ రాజకీయాల్లో తటస్థంగా ఉంటోన్నామని, అందుకే ఏ విషయంలోనైనా ఏ కూటమికీ మద్దతు ఇవ్వదలచుకోలేదని స్పష్టం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications