చర్చలు రద్దు: పోలీసుల హత్యల నేపథ్యంలో పాక్తో చర్చలు రద్దు చేసినట్లు భారత్ ప్రకటన
ఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి అతి దారుణంగా పాక్ ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి వేదికగా జరగాల్సిన భారత్ పాక్ చర్చలు జరగవని ప్రకటించింది భారత ప్రభుత్వం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీలు న్యూయార్క్లో చర్చలు జరపాల్సి ఉంది. అయితే శుక్రవారం జరిగిన ఘటనతో చర్చలు విరమించుకుంటున్నట్లు భారత్ తెలిపింది.
జమ్మూలో ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి చంపేశారు
గురువారం పాక్ ఆహ్వానం మేరకు న్యూయార్క్లో ఆదేశంతో భారత్ చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి రవీష్ కుమార్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే హిజ్బుల్ ఉగ్రవాదులు భారత్కు చెందిన ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి హత్యచేశారు. ఈ క్రమంలోనే ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు పాక్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు రవీష్ కుమార్.
బీఎస్ఎఫ్ జవాన్ నరేంద్ర కుమార్ గొంతు పాక్ సైనికులు కోశారని గుర్తుచేసిన రవీష్ కుమార్ ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన పాక్కు సరైన బుద్ధి చెప్తామన్నారు. ఈ ఘటనకు ముందే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి సెప్టెంబర్ 14న ద్వైపాక్షిక చర్చలకు ఆహ్వానిస్తూ లేఖ రాశారు.
ఆహ్వానం మన్నించి భారత్ పాక్తో చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపింది. అయితే అది ప్రత్యామ్నాయ వేదిక న్యూయార్క్లో ఉంటుందని కూడా తెలిపింది. ఈ భేటీపై అమెరికా కూడా ఆసక్తి కనబర్చింది. రెండు దేశాల మధ్య చర్చలు జరగడం శుభపరిణామం అని అమెరికా పేర్కొంది. అంతేకాదు రెండు దేశాల మధ్య విబేధాలు తొలిగిపోవాలని ఆకాంక్షించింది. ఈ క్రమంలోనే పాక్ మరో దారుణానికి పాల్పడింది.