చైనాను ఏం చేద్దాం?, సలహాలివ్వండి..: ప్రతిపక్షాలతో కేంద్రమంత్రుల ప్రత్యేక భేటీ రేపు!
భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ప్రతిపక్షాల నుంచి కేంద్రం సలహాలు కోరనుంది.
న్యూఢిల్లీ: డోక్లామ్ ప్రాంతంలో భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్రం ఆందోళన చెందుతోంది. గత నాలుగు వారాల నుంచి ఉద్రిక్తతలకు తెరపడకపోవడంతో.. దీనిపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలతో కేంద్రం ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. శుక్రవారం నాడు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
కబళించే ఎత్తుగడ: ఇండియాపై చైనా దూకుడు వెనుక.. ఇదీ అసలు కుట్ర?
భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరవుతారు. చైనా దుందుడుకు చర్యలకు బ్రేక్ వేయడానికి అవసరమైన సలహాలను ప్రతిపక్ష నేతల నుంచి వీరు స్వీకరించనున్నారు.
సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, లెఫ్ట్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలందరికి కేంద్రమంత్రులు కబురు పెట్టినట్లు తెలుస్తోంది. భారత్-చైనా సరిహద్దులోని భూటాన్ ప్రాంతంలో ఉన్న డొక్లామ్ వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య ఇప్పటికీ ఘర్షణపూరిత వాతావరణమే కొనసాగుతోంది.
భారత్ అక్రమంగా తమ భూభాగంలోకి చొచ్చుకొస్తుందని చైనా, చైనా సైన్యమే డొక్లామ్ అంశంలో ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని భారత్ తేల్చి చెప్పిన నేపథ్యంలో.. సరిహద్దు వద్ద పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.