చైనా అదే తొండి వాదన: ఫలితం తేలని బ్రిగేడ్ కమాండ్ స్థాయి సమావేశం
న్యూఢిల్లీ: ఆగస్టు 29-30ల మధ్య రాత్రి చైనా బలగాలు ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో మోహరించాయని, స్టేటస్ కోను మార్చిందని భారత్ ఆరోపించింది. అయితే, చైనా మాత్రం తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, తాము తమ సరిహద్దు దాటలేదని చెప్పుకొచ్చింది.
వాస్తవాధీన రేఖను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఎప్పుడూ దాటలేదని, గత 70ఏళ్ల ఇప్పటి వరకు ఏ దేశానికి చెందిన భూభాగాన్ని ఆక్రమించలేదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్యంగ్ తెలిపారు. కమ్యూనికేషన్ సమస్య వల్లే ఇరుదేశాల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తిందని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు.
అయితే, భారత బలగాలే వాస్తవాధీన రేఖను దాటాయని చైనా ఆరోపించింది. వెంటనే భారత బలగాలను వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేసింది. మంగళవారం జరిగిన బ్రిగేడియర్ స్థాయి సమావేశంలో కూడా చైనా ఇదే వాదనను వినిపించింది. చైనా తప్పు చేసి కూడా ఒప్పుకోకపోవడంతో భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన సమావేశం కూడా అర్ధాంతరంగానే ముగిసింది. దాదాపు రోజు మొత్తం సాగిన ఈ చర్చలు కూడా ఫలితం తేలకుండానే ముగియడంతో సరిహద్దులో ఉద్రిక్తలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.