చైనాతో యుద్ధంపై లఢక్ ఎంపీ సంచలన కామెంట్స్: సరిహద్దు వివాదాస్పద ప్రాంతాల్లో నైట్ హాల్ట్
లేహ్: చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలను చర్చలతో సామరస్యపూరకంగా పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోన్న వేళ.. భారతీయ జనతా పార్టీకి చెందిన లఢక్ లోక్సభ సభ్యుడు జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ తెగువ చూపారు. వివాదాస్పద ప్రాంతాలను సందర్శించారు. సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట పర్యటించారు. ఎల్ఏసీ సమీప గ్రామాల ప్రజలతో ముఖాముఖి కలిశారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యాన్ని ఇచ్చారు. చైనా కవ్వింపు చర్యల పట్ల భయపడాల్సిన పని లేదని, వాటి పరిష్కరించుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు.
We recite “Key Key So So Lhar Gyallo” at the summit of a mountain pass which means victory to the gods. We hoist coloured prayer flags offering to the Gods of elements known as Tarchok at high mountain passes. High wind will be of benefit in carrying the prayers reaching far away pic.twitter.com/0SdXSaKerb
— Jamyang Tsering Namgyal (@MPLadakh) June 8, 2020
సోమవారం ఉదయం ఆయన తన అనుచరులు, స్థానిక అధికారులతో కలిసి ఎల్ఏసీ సమీపంలో ఉన్న గ్రామాలను సందర్శించారు. భారత్, చైనా చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వస్తోన్న పాంగాంగ్ లేక్ సహా సరిహద్దుల్లో వివాదాలకు కేంద్రబిందువైన ప్రాంతాల్లో తిరుగాడారు. ఛుసుల్, గాల్వన్ వేలీ, షయాక్, మన్-మెరిక్ గ్రామాల్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు రోజుల పాటు తాను ఎల్ఏసీ వెంట ఉన్న గ్రామాల్లో పర్యటిస్తానని అన్నారు. చైనా తన భూభాగంపై భారీ ఎత్తున సైన్యాన్ని మోహరింపజేసిందని, యుద్ధ సామాగ్రిని సైతం తరలించిందనే విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్పై యుద్ధానికి దిగే సాహసాన్ని చైనా చేయకపోవచ్చని అన్నారు. యుద్ధానికి దిగాలని రెండు దేశాలు కూడా కోరుకోవట్లేదని చెప్పారు. 1962 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పారు. అప్పటి కంటే భారత్ ఇప్పుడు రక్షణరంగంలో అత్యంత బలంగా ఉందని అన్నారు. ఆర్థిక, రక్షణ రంగాల్లో చైనాను ఢీ కొట్టే స్థాయికి చేరుకుందని అన్నారు. నరేంద్రమోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశాలతో సత్సంబంధాలనే తప్ప యుద్ధ వాతావరణాన్ని కోరుకోవట్లేదని చెప్పారు. చైనాతో సఖ్యతను కోరుకుంటున్నామని, అలాగనీ తమ మంచితనాన్ని అలసుగా తీసుకోవద్దని హెచ్చరించారు.
@MPLadakh on three days extensive tour to Line of Actual Control (LAC) Border, the current site of conflict with China and ensures safety, security and overall development of the civilian residents along with Pangong Lake.@sudhirchaudhary @PMOIndia @AmitShah @DefenceMinIndia pic.twitter.com/RZnjKvHvAD
— Jamyang Tsering Namgyal (@MPLadakh) June 7, 2020
తన మూడురోజుల పర్యటన సందర్భంగా నంగ్యాల్.. ఎల్ఏసీ సమీపంలోని గ్రామాల్లో బస చేయనున్నారు. దీనికోసం లఢక్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్మీ అధికారుల నుంచి దీనికి అవసరమైన అనుమతిని తీసుకున్నారు. ఫోర్ ఫింగర్స్, పాంగాంగ్ లేక్, గాల్వన్ వ్యాలీ సమీపంలోని గ్రామాల్లో వందల సంఖ్య ప్రజలు జీవిస్తున్నారని, యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల వారిలో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయని నంగ్యాల్ చెప్పారు. తన పర్యటన వల్ల వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో పాటు తాము భూభాగాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేమనే సందేశాన్ని చైనాకు ఇచ్చినట్టవుతుందని అన్నారు.