చైనా తెంపరితనం: బోర్డర్లో యుద్ధ సామాగ్రి..క్షిపణులు: లఢక్లో ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా.. మరోసారి తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది పొడవునా భారత్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా డ్రాగన్ కంట్రీ మళ్లీ అలాంటి పరిస్థితే కల్పిస్తోంది. వాస్తవాధీన రేఖ సమీపానికి పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని తరలరించింది. ఏకంగా క్షిపణులను మోహరింపజేసింది. భూ ఉపరితలం నుంచి గాల్లో ఎగిరే లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉన్న మిస్సైళ్లను వాస్తవాధీన రేఖ వద్ద తరలించింది. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున సైన్యాన్ని సైతం చేర్చింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు నిర్ధారించారు. చైనా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రస్తుతం భారత్-చైనా ఆర్మీ అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. దశలవారీగా ఈ రెండు దేశాల కమాండర్ స్థాయి అధికారులు తరచూ లఢక్ సరిహద్దుల్లోని బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద భేటీ అవుతున్నారు. ఈ చర్చలు ఒకవంక కొనసాగుతుండగానే.. చైనా తన దుందుడుకు చర్యలను ముమ్మరం చేసింది. లఢక్ తూర్పు ప్రాంతంలోని కీలక పాయింట్లు పోస్టుల వద్ద యుద్ధ సామాగ్రిని తరలిస్తోంది. ఉద్రిక్తతలకు కారణమౌతోంది.
వాస్తవాధీన రేఖ సమీపంలోని గోగ్రా హైట్స్, హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ ప్లెయిన్స్, సీఎన్ఎన్ జంక్షన్ వంటి కీలక ప్రదేశాలకు అత్యాధునికమైన మిస్సైళ్లను తరలించింది. 250 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించే శక్తి సామర్థ్యాలు ఉన్న హెచ్క్యూ-9, హెచ్క్యూ-22 క్షిపణులను ఆయా ప్రాంతాలకు తరలించినట్లు భారత ఆర్మీ అధికారులు నిర్ధారించారు. చైనా చేర వేసిన యుద్ధ సామాగ్రిలో అత్యధికం ఎయిర్ డిఫెన్స్కు సంబంధించినవే కావడం ఆందోళనలకు దారి తీస్తోంది. వాస్తవాధీన రేఖ సమీపంలో భారత గగనతలంలో ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్లను ఆపరేట్ చేయడానికి చైనా వైఖరి ఇబ్బంది కలిగించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
పాంగ్యాంగ్ త్సొ లేక్, గాల్వన్ వ్యాలీ వంటి ప్రాంతాల నుంచి రెండు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. తూర్పు లఢక్ పరిధిలోని డెప్సాంగ్, డెమ్చోక్ వంటి చోట్ల తన సైన్యాన్ని చైనా కొనసాగిస్తోంది. ఆ దేశానికి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు సుదీర్ఘకాలం నుంచి మకాం వేసి ఉన్నాయి. చైనా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.