India Corona update : ఒక్క రోజులో 3 లక్షలకు చేరువగా కొత్త కేసులు, 2 వేలకు పైగా మరణాలతో కరోనా కల్లోలం
భారతదేశంలో కరోనా మహమ్మారి కట్టడి చేయలేని దారుణ పరిస్థితులు సృష్టించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా ను కట్టడి చేయడం పెద్ద తలనొప్పిగా తయారైంది. కరోనా నియంత్రణా చర్యలు ఎన్ని తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశంలో తీవ్ర ఆరోగ్య సంక్షోభం నెలకొంది. భారతదేశంలో ప్రస్తుతం 21,57,538 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1.67 లక్షలకు పైగా రికవరీలు నమోదయ్యాయి, దీంతో మొత్తం రికవరీలు 1.32 కోట్లకు చేరుకున్నాయి .
Recommended Video
మహా విలయం : కరోనా దెబ్బకు మహారాష్ట్రలో సంపూర్ణ లాక్ డౌన్ , నేడే ప్రకటన !!
గత 24 గంటల్లో 2,95,041 కొత్త కరోనా కేసులు , 2,023 మరణాలు
తాజాగా భారతదేశంలో గత 24 గంటల్లో 2,95,041 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. గత 24 గంటలలో 2,023 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాప్తి చెందినప్పటినుండి ఇప్పటివరకు ఇంత భారీగా మరణాలు, రోజువారి కేసులు నమోదు కాలేదు. కరోనా దేశంలో మరణ మృదంగం మోగిస్తోంది. మరణాల రికార్డు గత 24 గంటల్లో 2,023కి పెరిగి మొత్తం మరణాలు 1,82,553 కు చేరుకున్నాయి.
రోజువారీ కోవిడ్ -19 కేసులు అత్యధికంగా నమోదైన టాప్ 10 రాష్ట్రాలివే
గత 24 గంటల్లో రోజువారీ కోవిడ్ -19 కేసులు అత్యధికంగా నమోదైన టాప్ 10 రాష్ట్రాల విషయానికొస్తే మహారాష్ట్ర (62,097 కేసులు), ఉత్తర ప్రదేశ్ (29,574 కేసులు), ఢిల్లీ (28,395 కేసులు), కర్ణాటక (21,794 కేసులు), కేరళ (19,577) కేసులు), ఛత్తీస్ గడ్ (15,625 కేసులు), మధ్యప్రదేశ్ (12,727 కేసులు), గుజరాత్ (12,206 కేసులు), రాజస్థాన్ (12,201 కేసులు), తమిళనాడు (10,986 కేసులు) నమోదు అయ్యాయి .
భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 1.56 కోట్లకు పైగా కోవిడ్ కేసులు
భారతదేశంలో 1.56 కోట్లకు పైగా కోవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ తర్వాతి స్థానంలో భారతదేశం ఉంది. ఇక రోజు వారి కేసు నమోదులో మాత్రం భారతదేశం మొదటి స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో విజృంభిస్తోంది . విపరీతంగా కేసులు పెరుగుతున్న కేసుల కట్టడిలో లాక్డౌన్లను చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాలను కోరారు.
లాక్ డౌన్ చివరి అస్త్రం అన్న ప్రధాని మోడీ
గతేడాది కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే . నాటి పరిస్థితుల నుండి ఇంకా దేశం పూర్తిగా బయట పడలేదు .ఈ నేపథ్యంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ చివరి అస్త్రం అని పేర్కొన్నారు. మహారాష్ట్ర కరోనా కారణంగా దారుణంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది. మంగళవారం 62,097 తాజా కరోనావైరస్ కేసులను నివేదించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 39.6 లక్షలకు పైగా చేరుకున్నాయి.
మహారాష్ట్రలో కంట్రోల్ లో లేని కరోనా .. నేడు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటన
కరోనా మహమ్మారి కారణంగా ఒక్కరోజులో 519 మంది రోగులు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్డౌన్ లాంటి ఆంక్షలతో పాటు మరిన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాలని మహారాష్ట్ర కేబినెట్ సిఫార్సు చేసిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి సంపూర్ణ లాక్ డౌన్ పై ప్రకటన చేయనున్నారు. మహారాష్ట్ర తరువాత, కేరళ, కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లలో , ఉత్తర ప్రదేశ్ , ఢిల్లీ, చత్తీస్ గడ్ , రాజస్థాన్ , మధ్య ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో రోజువారీ కేసులు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.