మళ్ళీ కాస్త తగ్గిన కేసులు: 6 లక్షలకు యాక్టివ్ కేసులు..అయినా భయం గుప్పిట్లో భారత్
భారతదేశంలో కరోనా వైరస్ కేసులు గడిచిన రెండు రోజులు కాస్త పెరుగుతూ వచ్చినా, ఈ రోజు కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. అయినా భారత్ భయం గుప్పిట్లోనే ఉంది. మహమ్మారి ఎప్పుడు విరుచుకుపడుతుందో, ఏ రూపం తీసుకుంటుందో తెలీని పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలోని కోవిడ్ -19 కేసులు 51,667 నమోదు కాగా, మరణాలు 1,329 నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో ఇప్పటివరకు ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445 కు చేరుకుంది. మరణాల సంఖ్య 3,93,310 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
6 లక్షలకు తగ్గిన యాక్టివ్ కేసులు
కోవిడ్ -19 నుండి 64,527 మంది కోలుకోవడంతో క్రియాశీల కేసుల సంఖ్య 6, 12,868 కు తగ్గింది . మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య ఇప్పుడు 2,91,28,267 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కేసులో 4.4 శాతం తగ్గుదల కనిపించింది . ఇక రికవరీ రేటు 96.76 శాతానికి పెరగగా, క్రియాశీల కేసుల 2.03 శాతానికి తగ్గింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు ఆరు లక్షలకు పడిపోయాయి.ఇక భారతదేశంలో కొనసాగిస్తున్న కోవిడ్ -19 వ్యాక్సినేషన్ కార్యక్రమం 300 మిలియన్లకు పైగా చేరుకుందని తెలుస్తుంది.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్ .. డెల్టా ప్లస్ ఆందోళన మరోవైపు
ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఇప్పటివరకు మొత్తం 30,72,46,600 మందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్లుగా అంచనా. కోవిడ్ -19 సెకండ్ వేవ్ తో దేశం రెండు నెలలు పోరాడిన తరువాత, దేశం మూడవ వేవ్ మరియు వైరస్ యొక్క తాజా మ్యుటేషన్ డెల్టా ప్లస్ గురించి కొత్త ఆందోళనలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు, దేశంలో దాదాపు 40 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులలో గరిష్టంగా మహారాష్ట్ర నుండి నివేదించబడ్డాయి.
థర్డ్ వేవ్ త్వరగా వస్తుందన్న భయంలో దేశం
మధ్యప్రదేశ్ , కేరళ తరువాత ఉన్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ ,శివపురి జిల్లాలలో, మహారాష్ట్రలోని రత్నగిరి మరియు జల్గావ్ జిల్లాల్లో మరియు కేరళలోని పాలక్కాడ్ మరియు పతనమిట్ట జిల్లాల్లో నిర్ధారణ అయింది.దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుంది. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ పై పెద్దఎత్తున దృష్టి సారిస్తుంది. థర్డ్ వేవ్ చాలా భయానకంగా ఉండే అవకాశం ఉందని అలెర్ట్ గా ఉండాలని కేంద్రం సూచిస్తుంది .