చైనాకు ఒక అంగుళం కూడా పోనివ్వలేదు: రాహుల్ ఆరోపణలపై కేంద్రం స్పష్టత
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్ ప్రాంతంలోని ప్యాంగాంగ్ లేక్ నుంచి చైనా, భారత్ బలగాలు వెనక్కి వచ్చాయని, అయితే, ఎలాంటి సరిహద్దులు కొత్తగా నిర్ణయించలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో శుక్రవారం స్పష్టం చేసింది. భారత్ ఏ కొంచెం భూభాగాన్ని కూడా వదులుకోలేదని తేల్చి చెప్పింది.
భారత భూభాగాన్ని చైనాకు వదిలేసిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టత నిచ్చింది. అవాస్తవాలు ప్రచారం చేయొద్దని హితవు పలికింది. సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకే బలగాలను ఉపసహరించుకోవడం జరిగిందని తెలిపింది. మన ఆర్మీ బలగాలపై ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసింది.
అమరులైన సైనికుల త్యాగాలను అవమానించారంటూ ఎవరైతే అంటున్నారో.. వారే వాస్తవంగా సైనికుల త్యాగాలకు గౌరవం ఇవ్వడం లేదని రాహుల్ గాంధీనుద్దేశించి కౌంటర్ ఇచ్చింది. ఫింగర్ 4 వరకు భారత భూభాగమంటూ చేస్తున్న వాదనలో వాస్తవం లేదు. 1962లో చైనా అక్రమంగా ఆక్రమించుకున్న43000 చదరపు కిలోమీటర్లు కూడా భారతదేశ పటంలో చూపించబడతాయి, కానీ, ఆ భూభాగం ఇప్పుడు చైనా ఆధీనంలోనే ఉంది.
వాస్తవాధీన రేఖ ప్రకారం ఫింగర్ 8 వరకు భూభాగం భారత ఆధీనంలో ఉంది, ఫింగర్ 4 వరకు కాదు. ఫింగర్ 8 వరకు భూభాగం కూడా భారత ఆధీనంలోనే ఉంది. ఒక ఇంచు భూభాగం కూడా చైనాకు వదిలిపెట్టలేదని, వదిలిపెట్టమని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ కూడా గురువారం పార్లమెంటు సమావేశాల్లో ఇదే విషయాన్ని తేల్చి చెప్పిన సంగతి తెలిసందే.
సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఆర్మీ అధికారుల స్థాయిలో భారత్-చైనాల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, చర్చలు ఫలించడంతో చైనా బలగాలు వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన తమ బలగాలను వెనక్కి తీసుకున్నాయి. దీంతో భారత్ కూడా మన సైనిక బలగాలను వెనక్కి రప్పించింది. అయితే, చైనా ఆడమన్నట్లు ఆడే ప్రసక్తే లేదని, తమ భూభాగాన్ని ఒక అంగుళం కూడా చైనాకు వదులుకోబోమని రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో స్పష్టం చేశారు.