భారత్ వద్ద రూ. 474 లక్షల కోట్ల విలువైన బంగారం.. అమెరికా, చైనానూ కొనేయొచ్చు..!!
భారతీయులకు బంగారం అంటే ఓ ఎమోషన్.. శుభకార్యం ఏదైనా ఒంటి నిండా నగలతో వెళ్లాలని చాలామంది మహిళలు కోరుకుంటారు. దేశంలో బంగారం ధరలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఈ రోజుల్లో బంగారం కొనాలంటేనే వామ్మో అని బెంబెలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. అయితే భారత్ లో దేవాలయాలకు విరాళంగా ఇచ్చే బంగారాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది మత విశ్వాసాలతో భావోద్వేగపరంగా ముడిపడి ఉంటుంది.
పశ్చిమాసియాలో ఇరాన్ సంఘర్షణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో బంగారం మరోసారి భారత్ లో చర్చనీయాంశంగా మారింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచి.. బంగారు దిగుమతి నిబంధనలను కఠినతరం చేసింది. భారత్ బంగారు దిగుమతులు 72 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇది దేశ బంగారం కొనుగోళ్లపై పెరుగుతున్న ఖర్చుల గురించి ఆందోళనలను రేకెత్తిస్తోంది.
ఈ నేపథ్యంలో నిపుణులు భారత్ అధికారిక నిల్వల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా దేవాలయాలు, గృహాల్లో అపారమైన బంగారాన్ని కలిగి ఉందని అంటున్నారు. ప్రస్తుతం భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సుమారు 880 టన్నుల బంగారాన్ని అధికారిక నిల్వలుగా కలిగి ఉంది. అయితే ఇది భారత అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమైన బంగారం మాత్రమే. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం.. భారతీయ గృహాలు, దేవాలయాలు వెరసి 30,000 టన్నులకు పైగా బంగారాన్ని కలిగి ఉన్నాయి. కేవలం దేవాలయాల వద్దే దాదాపు 4,000 నుండి 5,000 టన్నుల బంగారం ఉందని అంచనా. కాగా భారతీయ గృహాలు 25,000 టన్నులకు పైగా బంగారాన్ని కలిగి ఉన్నాయని అంచనా.
ఇక యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా 8,931 టన్నుల బంగారు నిల్వలను కలిగి ఉంది. ఇది భారత్ ప్రైవేట్ బంగారు సంపద ఎంత అపారమైనదో స్పష్టం చేస్తుంది. అయితే, ఈ బంగారం చాలావరకు లాంఛనప్రాయ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ రికార్డుల వెలుపల ఉండటం పెద్ద సవాలు. "జర్నల్ ఆఫ్ ఏషియన్ స్టడీస్" లో ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం.. మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్రకారుడు బర్టన్ స్టీన్ను ఉటంకిస్తూ.. భారత్ దేవాలయ ఆర్థిక వ్యవస్థను దేశానికి పెద్ద బలంగా అభివర్ణించింది.
దేవాలయాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కాకుండా, వాణిజ్యం, ఉపాధి, విరాళాలు, పర్యాటకం, సామాజిక సంక్షేమంపై ప్రభావం చూపే శక్తివంతమైన ఆర్థిక సంస్థలుగా పనిచేస్తున్నాయని పేర్కొంది. భారత్ లో అపారమైన బంగారం, విలువైన ఆస్తులను కలిగి ఉన్న అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో, పద్మనాభస్వామి దేవాలయం అత్యంత ధనికమైనదిగా పరిగణిస్తారు. దీని బంగారు నిల్వలు సుమారు 1,300 టన్నులు ఉంటాయని నివేదికలు అంచనా వేస్తున్నాయి. తిరుమల వేంకటేశ్వర దేవాలయం కూడా తన అపారమైన సంపదకు ప్రసిద్ధి చెందింది. దాదాపు 11,329 కిలోగ్రాముల బంగారాన్ని కలిగి ఉందని నమ్ముతారు. ఇదిలా ఉండగా.. షిర్డీ సాయిబాబా దేవాలయం సుమారు 380 కిలోగ్రాముల బంగారాన్ని కలిగి ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఇక మధురైలోని మీనాక్షి అమ్మన్ దేవాలయం దాదాపు 300 కిలోగ్రాములను కలిగి ఉంటుందని అంచనా. ప్రసిద్ధ పూరీ జగన్నాథ్ దేవాలయం కూడా సుమారు 150 కిలోగ్రాముల బంగారాన్ని కలిగి ఉందని నమ్ముతారు. ఇది భక్తులు శతాబ్దాల తరబడి ఈ పవిత్రమైన మతపరమైన ప్రదేశాలకు సంపదను, విలువైన వస్తువులను విరాళంగా ఇచ్చే సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది.

మత విశ్వాసాలతో బంగారానికి ఉన్న ఈ లోతైన సంబంధం కారణంగా దేవాలయాల బంగారాన్ని నేరుగా ప్రభుత్వ నిల్వల్లోకి బదిలీ చేయడం సులభమైన విషయం కాదు. అయితే నిపుణులు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తున్నారు. దేవాలయ ట్రస్ట్లు స్వచ్ఛందంగా తమ బంగారం కొంత భాగాన్ని ప్రభుత్వ మద్దతుగల పథకాల్లో పెట్టుబడి పెడితే అది రెండు పక్షాలకూ ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విధానం ద్వారా దేవాలయాలు వడ్డీ రూపంలో రాబడిని పొందుతూనే ఉంటాయి. అదే సమయంలో బంగారం లాంఛనప్రాయ ఆర్థిక వ్యవస్థలో భాగం అవుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చడమే కాకుండా.. దేవాలయాల సంపదకు భద్రత, స్థిరమైన వృద్ధిని అందిస్తుంది.












Click it and Unblock the Notifications