షాకింగ్ రిపోర్ట్ : తీవ్ర అసమాన దేశాల జాబితాలో భారత్- పేద, ధనిక- స్త్రీ, పురుష ఆదాయ వ్యత్యాసాలు
ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు పెరుగుతున్నాయి. పేద, ధనిక అంతరాలే కాదు లింగ భేదాలు పెరుగుతున్నాయి. భారత్ కూడా ఈ జాబితాలో ముందుంది, తాజాగా విడుదలైన ప్రపంచ తీవ్ర అసమాన దేశాల జాబితాలో భారత్ స్ధానం దక్కించుకుంది. భారత్ లో ధనిక పేద అంతరాలతో పాటు లింగ అసమానతలు కూడా తీవ్రంగా ఉన్నాయని తాజా నివేదిక హెచ్చరించింది.
ఈ నివేదిక ప్రకారం భారత్ లో 10 శాతం వ్యక్తుల చేతుల్లో 57 శాతం ఆదాయం ఉందని, అలాగే 1 శాతం వ్యక్తుల చేతుల్లో 22 శాతం జాతీయ ఆదాయం ఉందని తెలిపింది. పేదలుగా ఉన్న మరో 50 శాతం మంది చేతుల్లో కేవలం 13 శాతం ఆదాయం మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. ఆర్ధిక వేత్త లూకాస్ ఛాన్సెల్ రూపొందిన ఈ నివేదికకు మరో ముగ్గురు ప్రసిద్ధ ఆర్ధికవేత్తలు థామస్ పికెట్టి, ఎమాన్యుయేల్ సాయెజ్, గాబ్రియేల్ జుక్ మన్ సహకరించారు.
ఈ నివేదిక ప్రకారం భారత్ లో వయోజనుల సగటు జాతీయాదాయం రూ.2.04 లక్షలు ఉండగా.. దారిద్రరేఖ కిందనున్న 50 శాతం మంది ఆదాయం రూ.53610 గా ఉంది. కానీ టాప్ 10 శాతం మంది మాత్రం రూ.11.66 లక్షలు ఆర్జిస్తున్నట్లు తేలింది. అలాగే కేంద్రం గత మూడేళ్లుగా ప్రకటిస్తున్న గణాంకాలు దారుణంగా ఉంటున్నాయని, అసమానతల్ని లెక్కించేందుకు ఇవి ఏమాత్రం ఉపయోగపడవని ఆర్ధికవేత్తలు తెలిపారు.
దశాబ్దాలుగా ప్రతీ దేశంలోనూ ప్రజా సంపదలో ప్రజల వాటా తగ్గుముఖం పడుతోందని ఈ నివేదిక పేర్కొంది. ప్రజా ఆస్తులుగా చెప్పుకునే ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర ప్రజా సేవలు నానాటికీ కరిగిపోతున్నాయి. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తితో ప్రజా సంపదలో క్షీణత, ప్రైవేట్ సంపదలో పెరుగుదల తీవ్రమైందని వెల్లడించింది. భారతదేశం, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సంపన్న దేశాల కంటే ప్రైవేట్ సంపదలో వేగంగా పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.
భారతదేశంలో సగటు కుటుంబ సంపద రూ.9,83,010గా ఉందని ఈ నివేదిక తెలిపింది. దేశంలోని దిగువన ఉన్న 50% మంది దాదాపుగా ఏమీ ఉండదని తేలింది. వీరి సగటు సంపద రూ. 66,280 లేదా మొత్తంలో 6%.గా ఉంది. సగటు సంపద రూ. 7,23,930 లేదా మొత్తంలో 29.5% ఉన్న మధ్యతరగతి సాపేక్షంగా పేదవారుగా ఈ నివేదిక చెబుతోంది. టాప్ 10% మొత్తం సంపదలో 65%, సగటున రూ. 63,54,070 కలిగి ఉన్నారు. అలాగే అగ్రశ్రేణి 1% కాస్తా 33%, సగటున రూ. 3,24,49,360 కలిగి ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది.
భారతదేశంలో లింగ అసమానత కూడా తీవ్రంగానే ఉంది. భారతదేశంలో స్త్రీ కార్మికుల ఆదాయం వాటా 18%గా ఉంది. ఇది ఆసియాలో సగటు కంటే గణనీయంగా తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. చైనా మినహా మిగిలిన దేశాల్లో ఇది 21%గా ఉంది. అలాగే ఇది ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. అయినప్పటికీ, మధ్యప్రాచ్యంలో సగటు వాటా (15%) కంటే ఈ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది.
ఈ నివేదికలో మరో కీలకాంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు గత 40 ఏళ్లలో ధనికులుగా మారాయి, కానీ వారి ప్రభుత్వాలు మాత్రం గణనీయంగా పేదలుగా మారాయి. సంపన్న దేశాలలో పబ్లిక్ యాక్టర్స్ వద్ద ఉన్న సంపద వాటా సున్నాకి దగ్గరగా లేదా ప్రతికూలంగా ఉందని, అంటే సంపద మొత్తం ప్రైవేట్ చేతుల్లో ఉందని నివేదిక చెబుతోంది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తరువాత, ప్రభుత్వాలు జీడీపీలో 10-20%కి సమానమైన రుణాన్ని ముఖ్యంగా ప్రైవేట్ రంగం నుండి తీసుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది