మోడీ గెలుపుపై ఐశ్వర్య రాయ్, ముగ్గురిపై జయ వేటు
ముంబై/చెన్నై: కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత దేశం ఉజ్వలంగా వెలుగుతుందని బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ సమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానిగా మోడీ నాయకత్వంలో భారత్ ఉత్తేజితమవుతుందని ఆమె ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ చెప్పారు.
దేశం ఆశాభావంతో ఉందని, అందరినీ కలుపుకొని వెళ్తూ అభివృద్ధి సాధించడం గురించి మోడీ ప్రసంగం విన్నానని, ఈ దేశ పౌరురాలిగా ఆయనతో కలిసి ప్రయాణించడానికి తాను ఎంతో ఇష్టపడతానని చెప్పారు. మోడీకి అన్నీ విజయాలే కలుగాలని దైవం ఆశీర్వదించాలన్నారు.
ముగ్గురిపై వేటేసిన జయలలిత
లోకసభ ఎన్నికల్లో సరిగ్గా పని చేయలేదంటూ మంత్రులపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేటు వేశారు. తన మంత్రివర్గం నుంచి ముగ్గురికి ఉద్వాసన పలికారు. అదే సమయంలో ఎన్నికల్లో కష్టపడి పని చేసిన మరో ముగ్గురికి తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు.
ఇందులో ఇద్దరు మాజీ మంత్రులే వుండగా, మరొకరు కోయంబత్తూరుకు చెందిన ఎమ్మెల్యే వున్నారు. సిఎం సిఫారసుల మేరకు ముగ్గురు మంత్రులను తొలగించి, మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించనున్నట్టు రాజ్భవన్ సోమవారం ప్రకటించింది. వ్యవసాయశాఖ మంత్రి ఎస్ దామోదరన్, కార్మికశాఖ మంత్రి కెటి పచ్చైమాల్, రెవెన్యూశాఖ మంత్రి బివి రమణలపై జయ వేటు వేశారు.
అదేవిధంగా తిరువణ్ణామలై జిల్లా కలశపాక్కం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ఎస్ కృష్ణమూర్తి, కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూర్ ఎమ్మెల్యే ఎస్పీ వేలుమణి, స్థానిక అన్నానగర్ ఎమ్మెల్యే ఎస్ గోకుల ఇందిరలకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. కాగా, జయలలిత ఆరుగురు జిల్లా నేతల పైన కూడా వేటు వేశారు. మూడు లోకసభ స్థానాల్లో ఓటమి నేపథ్యంలో ఆమె వేటు ద్వారా పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలు పంపించారు.