కరోనా విలయానికితోడు 6 విపత్తులు.. భారత్కు ఇది టర్నింగ్ పాయింటన్న మోదీ.. ‘ఆత్మనిర్భర్’తో సాగుదామంటూ
ప్రపంచ ఆరోగ్య సంస్థ, సైంటిస్టులు, వైద్యుల అంచనాలను మించి కరోనా వైరస్ విలయతాండం కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 74 లక్షలు, మరణాల సంఖ్య 4లక్షలు దాటిపోగా, భారత్ లో గురువారం ఒక్కరోజే ఏకంగా 9,996 కొత్త కేసులు, 357 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2.86లక్షలకు, మరణాలు 8,102కు పెరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మిగతా దేశాలకు, భారత్ కు తేడా వివరిస్తూ.. భవిష్యత్ కార్యాచరణపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఉపన్యాసమిచ్చారు.
Recommended Video
సరస్వతికి సీఎం జగన్ ప్రాధాన్యం.. డబుల్'ఆర్'తో విధ్వంసం.. లేవకుండా 'లా'తో కొడతానంటూ..
ఐసీసీ సదస్సు..
మన దేశంలో వ్యాపార రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థగా కొనసాగుతోన్న ‘‘ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)'' 95వ వార్షికోత్సవ సదస్సు గురువారం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. దేశ పారిశ్రామిక ప్రగతిలో ఐసీసీ సేవలను ఆయన కొనియాడారు. ప్రధానంగా ఈశాన్య భారతంలో మార్పులకు చాంబర్ చొరవ చూపిన విధానాన్ని ఆయన ప్రశంసించారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన సందర్భాన్ని అవకాశంగా మలుచుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
వరుస విపత్తులు..
ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాలకు మల్లే కరోనా మహమ్మారి ధాటికి భారత్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. కానీ ఇటీవల కాలంలోనే మనపైకి మరిన్ని విపత్తులు వచ్చిపడ్డాయి. వైరస్ కు తోడు రాకాసి మిడతల దాడి, రెండు అతి పెద్ద తుపానులు, వరదలు, గ్యాస్ బావిలో పేలుడు, వరుస భూకంపాలు మనల్ని గట్టిగా దెబ్బతీశాయని, కాబట్టి మనం ఇతరుల కంటే మరింత ధైర్యంగా నిలబడి పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ చెప్పారు.
ఆత్మనిర్భర్ మంత్రం..
కరోనా విలయాన్ని ఒక టర్నింగ్ పాయింట్ గా భావించి భారత్ ముందుకు కదలాలని, అందుకోసం ఆత్మనిర్భర్ మంత్రాన్ని జపించాల్సి ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ.. సొంతకాళ్లపై నిలబడాలని, తాను గతంలో ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్' నినాదాన్ని అనుసరించి, లోకల్ తయారీని పెంపొందించాలని, స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంలో ఏవిధంగానైతే దేశమంతా ఒక్కటిగా నిలిచి విజయం సాధించిందో.. రాబోయే రోజుల్లో వ్యాపార, వాణిజ్య రంగాల్లోనూ ఆత్మనిర్భర్ సూత్రంతో తప్పక విజయాలు సాధిస్తామనే ఆశాభావాన్ని పీఎం వ్యక్తం చేశారు.
‘దీదీకి చురక’
పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే క్రమంలో పాత సాంప్రదాయాలకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ అన్నారు. వెనుకబడిన రాష్ట్రాల్లో.. ప్రధానంగా వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల ఎట్టిపరిస్థితుల్లోనూ పరిశ్రమలు నెలకొల్పుతామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయబోమన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గతంలో టాటా ఫ్యాక్టరీని అడ్డుకోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ ఈ కామెంట్లు చేశారు.