దేశంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు, మెరుగ్గానే ఉన్నాం: కేంద్రం
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ... సామూహిక వ్యాప్తి లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. అయితే, కరోనా కేసులు మాత్రం పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయని పేర్కొంది. ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ కరోనా ప్రమాదకర స్థాయిలో ప్రబలలేదని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, మరో 2 మరణాలు
లాక్డౌన్ ద్వారా కరోనా వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకోగలిగామని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. 15 జిల్లాల్లో సర్వే చేయగా కేవలం 0.73 శాతం మందిలో మాత్రమే వైరస్ కనిపించిందన్నారు. మరణాలు రేటు కూడా స్వల్పంగానే ఉందని తెలిపారు.
మనదేశంలో మరణాల రేటు కేవలం 2.8శాతమేనని అన్నారు. ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా బారిన పడిన ప్రజల సంఖ్య మనదేశంలో తక్కువగానే ఉందని ఐసీఎంఆర్ డీజీ వెల్లడించారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల కంటే కూడా కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉందని తెలిపారు.
రికవరీ రేటు 49.1శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇక దేశంలో కరోనా ఆస్పత్రుల్లో పడకల కొరత లేదని, అన్ని సదుపాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
కాగా, దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,754కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,38,494గా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,41,129కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 8143కు చేరింది. దేశంలో తాజాగా 2781 కేసులు నమోదు కాగా, 35 మరణాలు సంభవించాయి. 1874 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.