పాక్ దాడుల్ని తిప్పికొట్టిన ఆ సుదర్శన చక్రాలకు కేంద్రం తాజా ఆర్డర్ ?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మన సైన్యం తొలుత పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను కుప్పకూల్చింది. దీంతో ప్రతీకారానికి దిగిన పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లోని రాష్ట్రాలపైకి భారీ ఎత్తున టర్కీ డ్రోన్లను పంపింది. అలాగే ఫైటర్ జెట్లు, మిస్సైళ్లను కూడా పంపింది. అయితే వీటన్నింటినీ భారత్ అంటే వేగంగా చిత్తుచేసేసింది. దీనికి కారణం రష్యా తయారీ ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థే.
ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థల్ని రష్యా నుంచి భారత్ ఎప్పుడో సమకూర్చుకుంది. అయితే వీటిని ఇప్పటివరకూ వాడాల్సిన అవసరం రాలేదు. కానీ పాకిస్తాన్ ఇప్పుడు మనకు ఆ అవసరం తీసుకొచ్చింది. దీంతో పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లు, ఫైటర్ జెట్ ల వల్ల మన దేశంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. దీంతో భారీ ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టాన్ని నివారించగలిగాం. ఇంకా చెప్పాలంటే ఈ యుద్ధంలో పాకిస్తాన్ పై మనం పైచేయి సాధించడంలో ఇవే కీలక పాత్ర పోషించాయి.

ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ వెనుక కీలకంగా ఉన్న ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థలు మరిన్ని కావాలంటూ రష్యాకు భారత్ ఆర్డర్ పెట్టినట్లు ఇండియా టుడే తెలిపింది. భారత సైన్యంతో ఇప్పటికే పనిచేస్తున్న రష్యా తయారీ S-400 వ్యవస్థలు, ఇటీవలి ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు,, డ్రోన్లను అడ్డగించడం, తటస్థీకరించడంలో కీలక పాత్ర పోషించాయి. పశ్చిమ సరిహద్దు దాటి నుండి వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కోవడంలో ఈ వ్యవస్థలు అధిక ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని ప్రదర్శించాయని ఆర్మీ ప్రకటించింది. దీంతో ఇలాంటి మరిన్ని వ్యవస్థల అవసరం ఉందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రష్యా తయారీ ఎస్ 400 లను భారత్ లో సుదర్శన చక్రాలుగా పిలుస్తున్నారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనవి. 600 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇవి ట్రాక్ చేయగలవు. అలాగే 400 కిలోమీటర్ల వరకు వాటిని అడ్డగించగలవు. 2018లో ఐదు ఎస్ 400 వైమానిక రక్షణ వ్యవస్థల సరఫరా కోసం రష్యాతో 5.43 బిలియన్ల అమెరికా డాలర్ల ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. పాకిస్తాన్ , చైనా నుండి వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి 2021లో పంజాబ్లో మొదటి దాన్ని మోహరించింది. నాలుగు రకాల క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం ఉన్న S-400 విమానం, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు మరియు బాలిస్టిక్ దాడుల్ని అడ్డుకోగలదు. దాని అధునాతన దశలవారీ రాడార్ ఒకేసారి 100 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది.












Click it and Unblock the Notifications