దేశంలో లక్షకు దిగువనే కరోనా కేసులు: పెరిగిన రికవరీ రేటు, 5 శాతం దిగువకు పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు లక్షకు దిగువనే నమోదయ్యాయి. సుమారు రెండు నెలల తర్వాత తగ్గుదల కనిపించడం గమనార్హం. అయితే, అంతకుముందు రోజుతో పోల్చితే మరణాల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. అదే సమయంలో దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.

దేశంలో కొత్తగా 92,596 కరోనా కేసులు
కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 19,85,967 నమూనాలను పరీక్షించగా 92,596 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2.9 కోట్ల మార్కును దాటింది. పాజిటివిటీ రేటు రెండో రోజు కూడా 5 శాతానికి దిగువనే ఉంది.

భారీగా పెరిగిన రికవరీలు..
ఒక్కరోజు వ్యవధిలో 2219 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా మహమ్మారి బారినపడి మరణించినవారి సంఖ్య 3,53,528కి చేరింది. మరోవైపు కోలుకున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గుతోంది. మంగళవారం 1,62,664 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2.75 కోట్లకు చేరింది. రికవరీ రేటు 94.29 శాతానికి చేరింది.

5శాతం దిగువకు పాజిటివిటీ రేటు..
ప్రస్తుతం దేశంలో 12,31,415 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 4.50 శాతానికి చేరింది. గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా తమిళనాడులో 18వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో 15వేల కొత్త కరోనా కేసులు, మహారాష్ట్రలో 11వేలకుపైగా కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.

ఒక్కరోజులో 27 లక్షల మందికిపైగా కరోనా వ్యాక్సిన్..
ఇది ఇలావుంటే, దేశంలో మంగళవారం 27,76,096 మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 23,90,58,360 మందికి కరోనా డోసులు వేశారు. సుమారు 3 కోట్ల మందికిపైగా రెండు వ్యాక్సిన్లు తీసుకున్నారు. దేశంలోని 18ఏళ్లు పైబడినవారందరికీ ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 21 నుంచి ఉచిత వ్యాక్సినేషన్ అమల్లోకి రానుంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే కేటాయించిన 35వేల కోట్ల రూపాయలకు అదనంగా మరో రూ. 15వేల కోట్లను ఖర్చు చేయనున్నారు.












Click it and Unblock the Notifications