వృద్ధిలో పతనం, నిరుద్యోగం.. : మోడీ చేసిన విపత్తులంటూ రాహుల్ విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మరోసారి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చైనాతో ఘర్షణలు, కుంగిన వృద్ధిరేటు, పెరిగిన నిరుద్యోగిత వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ.. వీటన్నింటికీ బీజేపీ ప్రభుత్వమే కారణమని విరుచుకుపడ్డారు.
'మోడీ వల్ల సంభవించిన ఈ విపత్తుల్లో భారత్ చిక్కుకుంది' అంటూ ఐదు అంశాల్ని ప్రస్తావించారు. వృద్ధిరేటులో పతనం, 45ఏళ్లలో గరిష్టానికి చేరిన నిరుద్యోగిత, 12 కోట్ల ఉద్యోగాల కోత, రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ ఆదాయాన్ని నిలిపివేయడం, కరోనాతో ప్రపంచంలోనే అత్యధిక మంది మరణించడం, సరిహద్దుల్లో పొరుగుదేశాల అతిక్రమణ' రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
కాగా, కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా భారత వృద్ధిరేటు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 23.9 శాతం పతనమైన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం కారణంగా తయారీ రంగం వృద్ధి 39 శాతం పతనం కాగా, మైనింగ్ వృద్ధి 23శాతం, నిర్మాణ వృద్ధి 50 శాతం, ట్రేడ్ అండ్ హోటల్ ఇండస్ట్రీ 47 శాతం పతనమయ్యాయి.
కరోనాను కట్టడి చేసేందుకు సుమారు నాలుగు నెలలపాటు కఠినంగా లాక్డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంఅన్ని రంగాలపై పడింది. ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి.