అంచనాలను తలకిందులు: వరుసగా వారంరోజులు: అదే తీవ్రత: మళ్లీ అరలక్షకు చేరువగా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఒక రాష్ట్రంలో తగ్గినట్టుగా కనిపిస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు.. మరోచోట భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా 50 వేలకు అటు ఇటుగా నమోదవుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య అక్కడి నుంచి దిగట్లేదు.. సరికదా మరింత పైపైకి వెళ్తోంది. వారంరోజులుగా 45 వేలకు పైగా నమోదవుతున్నాయి. అదే పరంపరను కొనసాగిస్తూ మరోసారి అదే రేంజ్లో రికార్డు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 48,513 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 768 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యశాఖ మంత్రిత్వశాఖ తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందట విడుదల చేసింది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 15 లక్షలను అధిగమించింది. ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 15,31,669కి చేరుకుంది. 34,193 మంది మరణించారు. 24 గంటల్లో 768 మంది మృతి చెందారు. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 9,88,030కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య అయిదు లక్షల మార్క్ను దాటింది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,09,447గా నమోదైంది. పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటుగా మరణాలు కూడా భారీగా నమోదు కావడం పట్ల అధికారుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.

ఏపీతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులకు ఏ మాత్రం కళ్లెం పడట్లేదు. చాలా రాష్ట్రాల్లో లక్షకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైన మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ముంబైలో 20 వేల కంటే తక్కువకు యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. రెండున్నర నెలల తరువాత యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేలకు దిగువకు చేరుకోవడం ఇదే తొలిసారి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావిలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని అధికారులు చెబుతున్నారు.
అదే సమయంలో 24 గంటల్లో ముంబైలో కొత్త కేసులు 700 వరకు మాత్రమే నమోదు అయ్యాయి. రాష్ట్రాల్లో అనూహ్యంగా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదైన ఫలితం.. జాతీయ గణాంకాలపై పడుతోంది. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. కరోనా విజృంభణను అడ్డుకోవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు.. నగరాల స్థాయిలో లాక్డౌన్ను ప్రకటించాయి. ఏపీలో నెల్లూరు, కడప, అనంతపురం, గుంటూరు వంటి పలు నగరాల్లో లాక్డౌన్ను ప్రకటించారు. తమిళనాడు, న్యూఢిల్లీల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.












Click it and Unblock the Notifications