చైనా కిరికిరి: తిప్పికొట్టిన భారత్ - ఎల్ఏసీపై డ్రాగన్ వివరణను తోసిపుచ్చిన విదేశాంగ శాఖ
వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కు సంబంధించి చైనా చేస్తోన్న అడ్డగోలు వాదనను భారత్ ఖండించింది. లదాక్ లోని పలు భూభాగాలు తనవిగా పేర్కొంటూ, అందుకు 1959 నాటి ఒప్పందాలను సాక్ష్యాలుగా చూపుతూ చైనా విదేశాంగ చేసిన ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. ఈ మేరకు చైనా అధికారిక పత్రికలో ప్రచురించిన కథనాలపై బుధవారం స్పందించిన భారత విదేశాంగ శాఖ(ఎంఈఏ) సదరు వాదనను తిరస్కరించింది.
Recommended Video

దానికి భారత్ ఒప్పుకోలేదు..
1959 నాటి ఎల్ఏసీ ఒప్పందం ప్రకారం లదాక్ లోని పలు భూభాగాలు తనవేనని చైనా వాదించగా.. అసలా ఒప్పందానికి భారత్ అంగీకరించలేదని, నాటి ఒప్పందం ఇద్దరికీ ఆమోదయోగ్యంగా జరగలేదని ఇండియా భావిస్తున్నదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, ఎల్ఏసీ అంశంలో ఏర్పడ్డ ప్రతిష్టంభనలు తొలగించేందుకు భారత్ తన వంతు ప్రయత్నం చేస్తోంటే, చైనా మాత్రం ఏకపక్షంగా అనుచిత వైఖరిని ప్రదర్శిస్తున్నదని మండిపడింది.

ఈ ఒప్పందాల మాటేమిటి?
ఎల్ఏసీ వెంబడి శాంతియుతంగా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు 1993లో కుదిరిన ఒప్పందం, 1996లో ఖరారైన.. సైనిక రంగంలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఒప్పందం(సీబీఎం), సీబీఎం అమలు ప్రోటోకాల్స్ కు సంబంధించి 2005లో కుదుర్చుకున్న అంగీకారాలను చైనా అడుగడుగునా ఉల్లంఘిస్తూ వస్తున్నదని భారత్ ఆరోపించింది. గత ఒప్పందాలు, మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా రెండు దేశాలు కలిసి ఎల్ఏసీని ధృవీకరించుకోవాలేగానీ, భారత్ అంగీకరించని 1959 ఒప్పందం ప్రకారం ప్రాంతాలను తమవిగా చైనా చెప్పుకోవడం అభ్యంతరకరమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

డ్రాగన్ కుటిల యత్నం..
ఎల్ఏసీ సరిహద్దులను మార్చేందుకు డ్రాగన్ దేశం చాలా కాలంగా నిరంతరంగా ప్రయత్నిస్తున్నదని, ఇదే విషయాన్ని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం పార్లమెంటులో నివేదించారని విదేశాంగ శాఖ గుర్తుచేసింది. గతంలో చోటుచేసుకున్న పరిణామాలు, అభిప్రాయభేదాల కారణంగా డిమార్కేషన్ ప్రక్రియ ముందుకు సాగలేదని, ఎల్ఏసీ సమస్యల్ని పరిష్కరించేందుకు చైనా కనీస ఉత్సాహాన్ని కూడా ప్రదర్శించలేదని ఎంఈఏ పేర్కొంది.












Click it and Unblock the Notifications