S400 Sudarshan: 50 వేల కోట్ల డీల్.. భారత్ కు రష్యా బంపర్ ఆఫర్
సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో గుబులు రేపుతూ, భారత ఆకాశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న 'ఎస్-400' సుదర్శన్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు సంబంధించి రష్యా సంచలన ప్రతిపాదనను భారత్ ముందుకు తీసుకొచ్చింది. భారత వైమానిక దళం (IAF) కోసం మరిన్ని ఎస్-400 క్షిపణి స్క్వాడ్రన్లను అందించే టెండర్ ప్రక్రియలో భాగంగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక వివరాలతో కూడిన డ్రాఫ్ట్ను సమర్పించింది. సుమారు రూ.50,000 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ మెగా డీల్ ద్వారా భారత వైమానిక దళానికి సరికొత్త ఊపిరి రానుంది.
ఇటీవల ముగిసిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ఎస్-400 క్షిపణి వ్యవస్థ చూపించిన దెబ్బకు శత్రు దేశం మైండ్ బ్లాంక్ అయింది. భారత సరిహద్దులకు 200 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చేందుకు కూడా పాకిస్థాన్ యుద్ధ విమానాలు వణికాయి. సుమారు 314 కిలోమీటర్ల సుదూర ప్రాంతంలో ఉన్న పాకిస్థాన్ నిఘా విమానాన్ని నేలకూల్చి, ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ దాడిగా ఎస్-400 రికార్డు సృష్టించిందని వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. చైనా పాకిస్థాన్కు అందించిన జె-10 యుద్ధ విమానాలను కూడా ఈ సుదర్శన్ దెబ్బకు నేలమట్టం చేసింది.

గగనతలంలో పటిష్టమైన కోట..
2018లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పటికే 4 ఎస్-400 స్క్వాడ్రన్లను అందుకోగా, చివరి 5వ స్క్వాడ్రన్ ఈ ఏడాది నవంబర్ నాటికి రష్యా నుంచి మన దేశానికి చేరుకోనుంది. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత కొత్తగా మరో 5 స్క్వాడ్రన్లను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఒప్పందంపై సంతకాలు పూర్తయిన మూడేళ్ల నుంచి ఈ కొత్త క్షిపణుల డెలివరీ ప్రారంభం కానుంది. ఈదనంగా రానున్న స్క్వాడ్రన్లను చైనా (తూర్పు), పాకిస్థాన్ (పశ్చిమ) సరిహద్దుల్లో మోహరించి, దేశ రక్షణ వలయాన్ని మరింత పటిష్టం చేయనున్నారు.
మిషన్ సుదర్శన్ చక్ర.. స్వదేశీ పరిజ్ఞానంతో మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్!
ఒకవైపు రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేస్తూనే, దానికి అదనంగా 280 క్షిపణులను కూడా ఇండియన్ ఆర్మీ సమకూర్చుకుంటోంది. దీనితో పాటు 'ప్రాజెక్ట్ కుశ' (Project Kusha) పేరుతో స్వదేశీ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత్ వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇటీవల 140 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి ఈ ప్రాజెక్ట్ తొలి విజయాన్ని అందుకంది. దేశం మొత్తానికి పూర్తిస్థాయి గగనతల భద్రత కల్పించేందుకు 'మిషన్ సుదర్శన్ చక్ర' పేరిట భారత రక్షణ దళాలు శరవేగంగా అడుగులు వేస్తున్నాయి.














Click it and Unblock the Notifications