188మందితో సముద్రంలో కుప్పకూలిన విమానం: నడిపింది ఇండియన్ పైలట్, బదిలీ కోరిన నెలల్లోనే..
జకార్తా: ఇండోనేషియాలో ఘోర ప్రమాదానికి గురైన విమానానికి ఢిల్లీకి చెందిన వ్యక్తి కెప్టెన్(పైలట్)గా వ్యవహరించారు. 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్ ఎయిర్ విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. ప్రయాణికులతోపాటు కెప్టెన్ భవ్యే సునేజా కూడా మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.

ఢిల్లీకి చెందిన పైలట్..
జకార్తా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ విమానం సముద్రంలో కుప్పకూలిపోయింది. ఢిల్లీకి చెందిన భవ్యే సునేజా అనే 31 ఏళ్ల వ్యక్తి ఈ విమానానికి పైలట్గా వ్యవహరించారు. సునేజా చాలా అనుభవమున్న పైలట్ అని అతని సన్నిహితులు, లయన్ ఎయిర్ అధికారులు చెబుతున్నారు.

బోయింగ్ విమానాలే నడిపేవారు..
ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన సునేజా 2011లో లయన్ ఎయిర్ సంస్థలో పైలట్గా చేరారు. ఆయన ఎక్కువగా బోయింగ్ 737 విమానాన్నే నడిపేవారు.

ఏం జరిగిందో తెలియదు... ఢిల్లీకి పోస్టింగ్ కోరిన కొద్ది నెలల్లోనే..
‘సునేజాతో జులైలో చర్చలు జరిపాం. అతని స్వస్థలం ఢిల్లీ కావడంతో అక్కడికే పోస్టింగ్ ఇప్పించాలని కోరారు. అతను చాలా మంచి వ్యక్తి. చాలా అనుభవమున్న పైలట్. ఇప్పటివరకు పైలట్గా అతని రికార్డులో ఎలాంటి లోపాలు లేవు. ఇన్ని నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టే అతన్ని ఇండోనేసియాకు చెందిన లయర్ ఎయిర్ సంస్థలోనే ఉంచాలనుకున్నాం. కానీ, తన కుటుంబం కోసం స్వస్థలానికి పోస్టింగ్ ఇప్పించాలని అడిగారు. మా సంస్థలో పనిచేసే పైలట్లంతా ఉత్తర భారత్కు చెందినవారే. వారు కూడా ఢిల్లీ పోస్టింగే కావాలని అడిగేవారు. దాంతో సునేజా అభ్యర్ధనను వెంటనే అంగీకరించలేకపోయాం. ఏడాది తర్వాత ఢిల్లీ పోస్టింగ్ ఇస్తామని చెప్పాం. అంతలోనే ఈ ప్రమాదం జరగడం విచారకరం. సునేజాతో పాటు విమానంలో ఉన్న ప్రయాణికులు, ఇతర సిబ్బంది క్షేమంగా బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం.' అని లయన్ ఎయిర్ అధికారులు వెల్లడించారు.
విమానం శకలాలు, కొందరి మృతదేహాల గుర్తింపు
సునేజా పైలట్గా వ్యవహరించిన విమానం సముద్రంలో కుప్పకూలిందని తెలీగానే అతని కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సునేజా, విమానంలో ఉన్న మిగతావారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాగా, విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానంకు సంబంధించిన పలు శకలాలను, వస్తువులను సహాయక బృందాలు వెలికితీశాయి. విమానంలోని కొందరు ప్రయాణికుల మృతదేహాలను కూడా పైకి తీసుకొచ్చారు. దాదాపు విమానంలో ఉన్న 188మంది ప్రయాణికులు కూడా మృతి చెందినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications