ఇండియాలో కరోనా తాజా పరిస్థితి ఇది .. 1.02 కోట్ల కేసులతో భారత్, కొత్త వైరస్ స్ట్రెయిన్ తో భయం భయం
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతూనే ఉంది . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 20,021 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 21,131 మంది కరోనా నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 279 మరణాలు సంభవించాయి. తాజా కరోనా కొత్త కేసుల సంఖ్య 7 శాతం పెరిగినట్లుగా తెలుస్తుంది . సెప్టెంబర్ నుంచి చూస్తే 25% కొత్త కేసుల సంఖ్య తగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి .

1.02 కోట్ల కరోనా కేసులతో ఇండియా .. 1,47 వేలకు పైగా మరణాలు
ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 1,02,07,871. వీటిలో 2,77,301 క్రియాశీల కేసులు. భారతదేశం ఇప్పటివరకు 97,82,669 రికవరీలను నమోదు చేసింది . మరణాల సంఖ్య 1,47,901 గా ఉంది. మరోవైపు ఇప్పటివరకు మొత్తం 16,88,18,054 నమూనాలను కరోనా వైరస్ మహమ్మారి నిర్ధారణ కొరకు డిసెంబర్ 27 వరకు పరీక్షించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. వీటిలో 7,15,397 నమూనాలను నిన్న పరీక్షించామని ఐసీఎంఆర్ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్ మరియు అస్సాంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్
కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రోగ్రాం కోసం రెండు రోజుల డ్రై రన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్ మరియు అస్సాంలో ప్రారంభమవుతుంది. వ్యాక్సినేషన్ అనంతర ప్రతికూల సంఘటనల నిర్వహణపై దృష్టి పెట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈరోజు డ్రై రన్ నిర్వహించి రాష్ట్రాలు తమ పరిశీలనను కేంద్రానికి నివేదిస్తాయి.
కోవిడ్ వ్యాక్సిన్ ద్వారా మొదటి దశలో 30 కోట్ల మందికి,మొదటి ప్రాధాన్యతగా ఆరోగ్య కార్యకర్తలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

కరోనా వ్యాప్తి కారణంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశం వాయిదా
61 మంది ఉద్యోగులు, అసెంబ్లీ సచివాలయం అధికారులు, ఐదుగురు ఎమ్మెల్యేలకు కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ కాగా , డిసెంబర్ 28 వ తేదీన ప్రారంభం కావాల్సిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశం వాయిదా పడినట్లు గా ప్రోటీమ్ స్పీకర్ వెల్లడించారు. అఖిలపక్ష సమావేశంలో మూడు రోజుల సమావేశాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

ఇండియాను కలవరపెడుతున్న కొత్త రకం కరోనా స్ట్రెయిన్
కరోనా కొత్తరకం వైరస్ పై భారత్ తో సహా అన్ని దేశాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కొత్త రకం వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన దేశాలనుండి వచ్చినవారికి 14 రోజులపాటు గృహనిర్బంధం ఉంచాలని ఇండియాలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా యూకే, బ్రిటన్ నుండి వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని ప్రత్యేకమైన ఐసోలేషన్ కు తరలిస్తున్నారు.
కరోనా కొత్త స్ట్రెయిన్ పాత కరోనా రకం కంటే వేగంగా విస్తరించే అవకాశం ఉన్న కారణంగా ప్రస్తుతం దీనిపై ఆందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications