దేశంలో 26కు చేరిన ఓమిక్రాన్ కేసులు-కేంద్రం తాజా హెచ్చరికలు-మాస్కులేవీ ?
దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ వైరస్ కలకలం పెరుగుతోంది. ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల్లో వీటి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ బయటపడిన ఓమిక్రాన్ కేసులన్నీ మైల్డ్ కేసులే అని చెప్తున్న కేంద్రం.. అసలు పండగ ముందుందని హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 26కు చేరిన నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

26కు చేరిన ఓమిక్రాన్ కేసులు
భారత్ లో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 26కు చేరింది. ఇవాళ ఒక్క రోజే రెండు ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో భారత్ లో కేసు నమోదైన తర్వాత దుబాయ్ వెళ్లిపోయిన దక్షిణాఫ్రికా జాతీయుడిని మినహాయిస్తే మొత్తం 25 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన వారే కావడంతో ఆయా రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్టాలు అప్రమత్తమై ఈ కేసుల కాంటాక్ట్ లను గుర్తించే పనిలో బిజీగా ఉన్నాయి. ఆ లోపే కొత్త కేసులు తిరిగి అక్కడే నమోదు కావడం కలకలం రేపుతోంది.

పొరుగు రాష్ట్రాలకూ ముప్పు
దేశంలో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లోనే ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అయితే ఈ రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో మిగిలిన రాష్ట్రాల్లోనే త్వరలో కొత్త ఓమిక్రాన్ కేసులు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓమిక్రాన్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో బాధితుల కాంటాక్ట్ లు చాలా మటుకు కనిపించకుండా పోతున్నారు. వైరస్ భయాలతో వీరు పొరుగు రాష్ట్రాలకు కూడా పారిపోతున్నారనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల్లో కేసుల ముప్పు పెరుగుతోంది.

కేంద్రం హెచ్చరికలు
నాలుగు రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. మిగతా రాష్టాలకూ కరోనా హెచ్చరికలు పంపుతోంది. గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్రాల్ని కోరుతోంది. దీంతో ఏఫీతో పాటు పలు రాష్ట్రాలు ఇవాళ కరోనా మార్గదర్శకాలను మళ్లీ బయటకి తీశాయి. ఆంక్షల్ని ప్రకటిస్తున్నాయి. మార్గదర్శకాల్ని అమలు చేయని వారిపై జరిమానాల కొరడా ఝళిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసుల సంఖ్య పెరిగితే తిరిగి లాక్ డౌన్ పెట్టేందుకు సైతం సిద్ధమవుతున్నాయి.
Recommended Video

మాస్కుల వాడకం తగ్గడంపై సీరియస్
దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో గతంలోలా ప్రజలు మాస్కులు ధరించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రాలు కఠిన నిబంధనలు, జరిమానాలు విధించడం ద్వారా మాస్కుల వినియోగం పెంచాలని ఆదేశాలు ఇస్తోంది. దీంతో ఏపీలో ఇప్పుడు మాస్కులు వేసుకోనివారికి రూ.100 ఫైన్ విధించాలని, మాస్కుల్లేని వారిని తమ షాపుల్లోకి, మాల్స్ లోకి రానిస్తే వారికి రూ.10000 జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. కఠిన నిబంధనలతో పాటు గతంలో తొలి రెండు వేవ్ ల సమయంలో అమలు చేసిన నిబంధనల్ని బయటకు తీస్తున్నాయి.












Click it and Unblock the Notifications