Omicron Virus : భారత్ లో 32కు చేరిన ఓమిక్రాన్ కేసులు-మహారాష్ట్రలోనే 17 కేసులు
భారత్ లో ఓమిక్రాన్ వైరస్ కల్లోలం క్రమంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ ఒకట్రెండు కేసులే కనిపంచగా.. ఇవాళ ఏకంగా 7 కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్ లోని ఐదు రాష్ట్రాల్లో ఈ కల్లోలం కనిపిస్తోంది. ప్రతీ చోటా కొత్త కేసులు నమోదు కావడం, బాధితుల్ని ప్రత్యేకంగా క్వారంటైన్ కు పంపడం, వాటి కాంటాక్టుల కోసం గాలించడంలో అధికారులు బిజీగా మారిపోతున్నారు.
భారత్ లోని మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, గుజరాత్ లో ప్రధానంగా కరోనా ఓమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇందులోనూ ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా ఇప్పటివరకూ 17 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఓ చిన్నారి కూడా ఉండటం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని ముంబైలో ఇవాళ 3 కేసులు నమోదు కాగా.. పింప్రీ చించ్వాడ్ లో మరో నాలుగు కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే బాధితుల శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపగా.. ల్యాబ్ ల నుంచి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దీంతో ఓమిక్రాన్ ఊహించని విధంగా ప్రభావం చూపుతున్నట్లు అర్దమవుతోంది.
ఇవాళ మహారాష్ట్రలో నమోదైన కేసులతో పాటు ఢిల్లీలో కూడా ఓ కొత్త కేసు నమోదైంది. ఇప్పటికే ఢిల్లీలో ఓమిక్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో అటు ఢిల్లీ సర్కార్ తో పాటు ఇటు కేంద్రం కూడా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఢిల్లీలో ఆంక్షలు మొదలయ్యాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ మార్గదర్శకాల్ని మరోసారి కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఇవాళ ఆదేశాలు పంపింది. మాస్కులు వేసుకోకుండా జనం రోడ్లపై విచ్చలవిడిగా తిరగడంపైనా కేంద్రం ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాలు ఈ మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు పంపింది.
మరోవైపు భారత్ లో ఓమిక్రాన్ ముప్పు పెరుగుతున్నా కేంద్రం మాత్రం బూస్టర్ డోస్ లేదా మూడో వ్యాక్సిన్ డోస్ పై మౌనం వహిస్తోంది. ఇప్పటికీ భారత్ లో డబుల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తికాకపోవడమే ఇందుకు కారణంగా చెబుతోంది. కానీ ఇప్పటికే డబుల్ డోస్ తీసుకున్న వారు మాత్రం బూస్టర్ డోస్ వేయించుకునేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.