భారత్ పీఓకే ను స్వాధీనం చేసుకోవాలి.. ఇదే శాశ్వత పరిష్కారం: బ్రిటన్ ఎంపీ సంచలనం
పహల్గాం ఉగ్రదాడితో భారత్- పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరుదేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు పాకిస్థాన్ పై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ లోని భారత సంతతికి చెందిన ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ను స్వాధీనం చేసుకోవాలని కోరారు. కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇదేనని వివరించారు.
భారత్ ను దశాబ్దాలుగా పట్టి పీడుస్తున్న కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం భారత ప్రభుత్వం పీఓకేను స్వాధీనం చేసుకోవడం మాత్రమేనని ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని.. ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను వెంటాడి శిక్షించాలని సూచనలు చేశారు.
" పహల్గాం ఉగ్రదాడి ఓ క్రూరమైన చర్య. ఇప్పుడు మన ముందు ఉన్నది ఒక్కటే. పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవడం. దశబ్దాల క్రితమే కాశ్మీర్ మహారాజు మనకు అనుమతి ఇస్తూ లేఖ కూడా రాశారు. ఆ భూభాగం మనదే. అందుకే పీఓకేను స్వాధీనం చేసుకోవడమే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం. పహల్గాం ఉగ్రదాడి చివరిది కావాలి. ఇప్పుడు భారత్ పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడితే భారత్ పీఓకేను స్వాధీనం చేసుకుంటుందన్న భావన వారిలో కలిగేలా చేయాలి" అని బ్రిటన్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం దిల్లీలోనే ఉన్న ఆయన ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

మరో వైపు, పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను కఠినంగా శిక్షించాలని తాము భారత్ను కోరుతున్నట్లు బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఉగ్రవాద నిర్మూలనలో భారత ప్రభుత్వానికి తాము ఎప్పటికీ అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే త్రివిధ దళాలతో భేటీ అయ్యారు. వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోనూ ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు.పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కఠినమైన చర్యలతో పాకిస్థాన్ ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది భారత ప్రభుత్వం. సింధూ జలాల రద్దు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇక భారత్ భయంతో.. పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను పాకిస్థాన్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది. అక్కడ ఉన్న ఉగ్రవాదులను బంకర్లు, ఆర్మీ షెల్టర్లలోకి హుటాహుటిన తరలిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో పీఓకేలోని ఉగ్రవాదులను ఎలాగైనా కాపాడుకునేందుకు పాకిస్థాన్ ఆర్మీ ఇలా చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. ఉగ్రదాడి జరిగిన వీడియోలను ఎన్ఐఏ విశ్లేషిస్తోంది. జిప్లైన్ ఆపరేర్లను విచారణ చేస్తున్న ఎన్ఐఏ.. బైరసన్ లోయలో ఉగ్రవాదులు వాడిన 40 క్యాట్రిడ్జ్లను గుర్తించింది.












Click it and Unblock the Notifications