ఓటు బ్యాంక్ రాజకీయాలొద్దు: ‘రైతు నిరసన’లపై చర్చ’ యూకేకు భారత్ సమన్లు
న్యూఢిల్లీ: భారతదేశంలో శాంతియుత ఆందోళనలు, మీడియా స్వేచ్ఛపై బ్రిటన్ పార్లమెంటు చేపట్టిన డిబేట్పై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ చర్చను తాము అంగీకరించమని చెప్పింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా డిబేట్ నిర్వహించారని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, ఈ విషయంపై బ్రిటీష్ హైకమిషనర్కు మంగళవారం సమన్లు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఆందోళనకు అంతర్జాతీయంగా పలువురు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్లో ఆందోళనకారుల భద్రత, భద్రత, మీడియా స్వేచ్ఛపై బ్రిటీష్ పార్లమెంటులో సోమవారం గంటన్నరపాటు డిబేట్ జరిగింది. ఈ చర్చలో పలు బ్రిటీష్ పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొని నిరసనకారులు, జర్నలిస్టుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఆందోళనల కవరేజీ విషయంలో మీడియా ప్రతినిధులకు స్వేచ్ఛ లేదని ఆరోపించారు. బ్రిటన్లోని భారత మూలాలున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అంతేగాక, ఇరు దేశాల ప్రధానులు ముఖాముఖీగా కలుసుకున్నప్పుడు యూకే ఈ అంశాలను లేవనెత్తుతుందని ఆ దేశ మంత్రి నీగెల్ ఆడమ్స్ వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఈ విషయంపై చర్చించే అవకాశముందన్నారు. రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంటులో జరిగిన చర్చను భారత్ తీవ్రంగా ఖండించింది. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని హితవు పలికింది. బ్యాలెన్స్డ్ డిబేట్కు బదులు.. తప్పుడు వాదనలు చేయడాన్ని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై నిందలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు లండన్లో భారత హైకమిషనర్ ఓ ప్రకటన విడుదల చేసింది.
భారతదేశంలో బ్రిటీష్ సహా అనేక విదేశీ మీడియా సంస్థలు కూడా పనిచేస్తున్నాయని, అవన్నీ రైతుల ఆందోళన గురించి ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని.. తమ దేశంలో మీడియాకు స్వేచ్ఛ కొరవడిందనే ప్రశ్నే ఉత్పత్తన్నం కాదని స్పష్టం చేసింది. ఒకవేళ భారతదేశంపై ఎవరైనా నిందారోపణలు చేయాలనుకుంటే అన్నీ నేరుగా చేయాలని తేల్చి చెప్పింది. నిజానిజాలు తెలుసుకోకుండా అనవసర ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికింది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు దూరంగా ఉండాలని యూకేకు భారత్ చురకలంటించింది.












Click it and Unblock the Notifications